Sunday, November 25, 2012

నన్నయ కవితలో తరుగని పరువము (Nannaya Kavithalo Tharugani Paruvamu)

"నీ రొమ్ము చీల్చి రక్తం త్రాగుతాను" అని దుశ్శాసనున్ని - "నా గదాఘాతంతో నీ తొడలు విరుగగొడతా"నని దుర్యోధనుణ్ణి, ఉద్దేశించి భీముడు చేసిన భీష్మ ప్రతిజ్ఞలు, ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం లోనివి. పై భావాలను వ్యక్తీకరించే పద్యాలు నన్నయగారు వేయిసంవత్సరాల క్రితం ఆంధ్రమహాభారతంలో రచించారు. నేటికీ ఈ పద్యాలు - "కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవుల్", "ధారుణిరాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి" అని రాగయుక్తంగా నటులు నాటకరంగంలో పాడుతూనే ఉన్నారు. శ్రోతలు మధురానుభూతి పొంది "వన్స్ మోర్" అంటూ రెండవమారు వినగోరుతున్నారు. పద్యాలు సంస్కృత సమాసాలతో కూడి సామాన్యునకు అర్థం కావు. మరి ఎలా విని, ఆనందిస్తున్నారో చదివి తెలుసుకుందాం.

మన మహర్షులు విశ్వం నలుమూలలనుంచి గొప్ప భావాలను ఆహ్వానించారు. సమస్త ప్రాణకోటికీ సుఖశాంతులు ఆకాంక్షించారు. మాకు, వారికి అన్న సంకుచిత తత్వం వారి ఊహకే అందని విషయం. 
మన కవులు కూడా మహర్షుల మార్గాన్నే అనుసరించారు. ఋషిత్వాన్ని ఉపాసించారు. ఋషిత్వం లేకుంటే కవిత్వం లేదనే వారి విశ్వాసం. కావ్యాల వల్ల కవులు ఆశించిన ప్రయోజనం విశ్వశ్రేయస్సు. విశ్వశ్రేయాన్ని మాటల్లో వల్లెవేయడం తేలికే. కాని మనసులోనూ, మనుగడలోను దాన్ని ప్రతిఫలింపజేయడం కష్టం. 

నన్నయ నిత్యసత్యవచనుడూ, విజ్ఞాననిరతుడూ, అవదాతచరితుడునూ. ఆయన త్రికరణశుద్ధి నిండుగా పండిన మనీషి, అంచేత ఆయన్ని ఋషి అనడానికి సందేహం వుండదు. 
నన్నయ భారతం రచించింది తెలుగులోనే. అయినా దానివల్ల ఆయన కాంక్షించిన ప్రయోజనం జగద్ధితం! తెలుగువారికి మాత్రమే ప్రయోజనం కాదు. భాషకు హద్డులుంటాయి. కాని అవి భావానికి ఉండవని ఆయనకు తెలుసు. విశ్వవిశాలమైన ఈ భావన, ఆయన రచనలో అక్కడక్కడా మనకు గోచరిస్తూనే ఉంటుంది. కొడుకును కౌగిలించుకుంటే కలిగే సౌఖ్యం మరి దేని వల్లా కలుగదని చెప్పేటప్పుడు, అది జీవులన్నింటికీ అంతే అంటాడాయన. (పుత్రగాత్రపరిష్వంగము నట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే); దాన్ని మనుష్యులకు మాత్రమే పరిమితం చెయ్యడు. "ఆత్మవ త్సర్వ భూతాని" అన్న తత్వం ఆయనలో ఇమిడిపోయింది. అలాంటి మహర్షి మన భాషకు ఆదికవి కావటం మన అదృష్టం!

నన్నయ భారతం రచించి దాదాపు వెయ్యేండ్లు కావస్తున్నా, ఈనాటికీ అది కొత్తదనం కోలుపోలేదు. భారతకథా వస్తువే అలాంటిది అనే సమాధానం ఒకటి ఉండనే ఉంది. కానీ నన్నయ కవిత్వంలో అలాంటి ఒకానొక నిత్యనూతనత్వం పొందుకొని ఉండడం గమనింపవలసిన విశేషం. 

పాతదైనా కొత్తగా తోచడం, సౌందర్యానికి లక్షణం. ఈ సౌందర్యం నన్నయగారి శబ్దరచనలోనూ, అర్థరచనలోనూ, మనం దర్శించవచ్చు. విశేషమేమిటంటే శబ్దార్థ సౌందర్యాలు రెండూ అవినాభావంతో ఆయన రచనలో కానవస్తాయి. అందుకే ఆయన భారతం అందరి ఆదరాన్ని అందుకున్నది; అందుకుంటున్నది. ఆ అంశాన్ని ఇక్కడ కొద్దిగా పరిశీలిద్దాం. 

మ||  కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో 
        ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ 
        కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర 
        ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్"

తాత్పర్యం: వృద్ధులైన కురువంశీయులు, ద్రోణాచార్యాది గురువులు, పెద్దలనేకులు చూస్తుండగా మదముచే నిరంకుశుడై ద్రౌపది నీ విధంగా చేసిన క్రూరదుశ్శాసనుని లోకమునకు భయం కల్గించే విధంగా యుద్ధమున చంపి రాజైన దుర్యోధనుడు చూస్తుండగా వాని వెడల్పైన రొమ్మనెడి పర్వతం నుంచి సెలయేరు వలె ప్రవహించు రక్తాన్ని భయంకరాకారంతో రుచి చూస్తాను. 

ఉ||   "ధారుణి  రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి, రం
         భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు
         ర్వార మదీయబాహుపరివర్తిత చండ గదాభిఘాత భ
         గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్"

తాత్పర్యం: భూమి మీద తన రాచరికం చెల్లుతున్నదనే గర్వంతో దుర్యోధనుడు ద్రౌపదిని చూచి తన తొడల మీద కూర్చొన రమ్మని పిల్చినాడు. ఆ దుర్మార్గున్ని యుద్ధంలో నా చేతులతో గదను తిప్పుతూ దాంతో వాడి తొడలు నుగ్గు చేస్తాను.          

ఈ పద్యాలు రెండూ ఆంధ్రమహాభారత ద్రౌపదీవస్త్రాపహరణఘట్టం లోనివి. ఇవి నన్నయ గారు రంగస్థలానికని ఉద్దేశించి రాసినవి కావు. ఆ సందర్భంలో భీమసేనుడి కోపతీవ్రతనూ, అతని ప్రతిజ్ఞలోని భయంకరత్వాన్నీ పాఠకుల మనస్సుకు అందించడానికని రాసినవి. కాని, నాటి నుంచి నేటిదాకా ఈ పద్యాలు రంగస్థలం మీద, సినిమాల్లోనూ వినవస్తున్నాయి. అంతమాత్రమే కాదు. కొంత ఇంచుమించుగానైనా ఈ ఘట్టంలో వీటికి సాటిరాగల పద్యాలు మరేవీ మనకు కానరావడం లేదు కూడా. మరి ఈ నాటకాన్ని చూచే ప్రతివారికీ ఈ పద్యాల్లోని భావం పూర్తిగా అర్థమౌతుందని మనం తలవడానిక్కూడా వీల్లేదు. ఇందులోని సంస్కృతపదాలు, సమాసాలు చదువుకున్నవాళ్లకే అర్థంకావడం కొంతకష్టం. ఇక చదువురాని వాళ్ల మాట చెప్పనవసరం లేదు. అయినా ప్రేక్షకులంతా ఈ పద్యాలు విని సంతోషిస్తున్నారు. అందులోని భావమంతా తమకు అర్థమైనట్లు తలచి మురిసిపోతున్నారు. భీమసేనుడితో ఆత్మైక్యం చెంది పరవశిస్తున్నారు. అందువల్ల ఏదో అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. "మరోసారి మరోసారి వినాలి" అని కేకలు పెడుతున్నారు. 

ఇదంతా మనం గమనించినప్పుడు, నన్నయ గారి వాక్కులలో మాటలకందని, కాలాన కరిగిపోని, ఏదో ఒక మహత్తరమైన ఆకర్షణశక్తి ఉందనీ, ప్రవాహరూపంగా సాగిపోతున్న తెలుగుభాషలో ఎన్ని కొత్తదనాలు తలయెత్తుతున్నా ఆయన రచనలో వాటికన్నింటికీ మించిన ఏదో ఒక కొత్తదనం చోటు చేసుకుందనీ తప్పక అనిపిస్తుంది. 

పాండవులు జూదంలో పరాభూతులయ్యారు. ద్రౌపది, కౌరవులకు వరవుడు చేయవలసివచ్చింది. దుశ్శాసనుడామెను జుట్టు పట్టి సభకు లాగి వలువలూడ్చినాడు. అదో అమానుషకృత్యం. పరాయివాళ్లకే ఆ దృశ్యం చూడ సహించరానిది. ఇక భీముడెట్లా ఓర్చుకుంటాడు? పైగా ద్రౌపది తన దిక్కులేనితనాన్ని వెళ్లగక్కుతూ చూచిన చూపులు, భీమసేనుని హృదయంలో పాముకాట్లవలె పని చేసివుంటాయి. ఈ దృశ్యంలో ప్రేక్షకులంతా భీమసేనుని మీదనే మనసు, కళ్లు నిలిపి చూస్తుంటారు. 

అప్పటి భీమసేనుడి కోపావేశం ప్రేక్షకులకు తెలుసు. ఎందుకంటే వారి హృదయాల్లో కూడా అలాంటి పరిస్పందన వుంటుంది. కనుక దాన్ని భీముడెట్లా వెల్లడిస్తాడో చూడాలనేదే ప్రేక్షకుల ప్రతీక్ష. ఆ సందర్భంలో భీముడు "కురువృద్ధుల్" అన్న పద్యంతో తన కోపోద్రేకాన్ని ప్రకటిస్తాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ద్రౌపదిని జూచి తొడమీద కూర్చుందువు రమ్మని సైగ చేస్తాడు. అది చూచిన భీముడు, అగ్గిమీద గుగ్గిలంలా మండిపడతాడు. వెంటనే తన మనసులోని ఉడుకునంతా వెళ్లగక్కుతాడు. ఈ పద్యాలు చెవిలో పడగానే ప్రేక్షకులు ఇంతకుముందు తమకు అందీ అందకుండా వుండిన ఏదో అనుభూతి హృదయమంతా పరుచుకున్నట్లు భావించి తన్మయత్వం చెందుతారు. అంటే భీముని నోటి నుండి వెలువడిన ఆ మాటలు, అందులోని విన్యాసాలు అంత సందర్భోచితంగా ఉన్నాయన్నమాట!

ఈ పద్యాలు చదువుతున్నప్పుడు వీటిలోని మాటలకన్నింటికీ అర్థాలు తెలియకున్నా అందులోని భావం హృదయాన్ని తాకుతున్నట్లు తోచడం, శబ్దాలు చెవిలో పడుతున్నప్పుడు ఏదో మాధుర్యం హృదయానికి ఆప్యాయంగా వుండడం, అందులోని ధ్వనుల విన్యాసం ఆ సన్నివేశానికి సముచితంగా ఉన్నట్లు అనిపించడం, ఇవన్నీ ప్రేక్షకులు తమకు తెలియకుండానే అనుభవిస్తారు. అందులోనే లీనమౌతున్నారు. 

కోకిలపాటకు అర్థమేమో మనకు తెలియదు. అయినా అది వినగానే మన హృదయంలో ఏదో ఒక సంవేదన కలుగుతుంది. దాన్ని మనం ఫలానా అని నిర్వచించలేకపోవచ్చు. కాని అందువల్ల కలిగే హృదయస్పందనను కాదనడానికి వీల్లేదు. అదేమో మన హృదయంలో చిరుగుప్త సౌహృదయాలను మేలు కొలుపుతుంది. రమ్యమైన దృశ్యాలకు, మధురమైన శబ్దాలకు ఈ శక్తి సహజం. నన్నయ గారి మాటలకు అంతే. వాటి మాధుర్యం అలాంటిది. అందువల్లనే అవి మంత్రాల్లాగా మనల్ని ముగ్ధుల్ని చేస్తున్నాయి.

నన్నయగారి పద్యాలు చదువురాని వాళ్లని సైతం ఆకర్షించడానికి మరొక కారణం కూడా ఉంది. ఒక భావాన్ని స్ఫురింపజేయడానికి, నన్నయ ఆ భావం యొక్క జీవస్థానాలను సామాన్యుడికి కూడా అర్థమయ్యే మాటల్లోనే మీటుతాడు. అందువల్ల పద్యంలోని సారభూతమైన అర్థం శ్రోతకు సుబోధకంగానే ఉంటుంది. 

"ధారుణి రాజ్యసంపద" అన్న పద్యంలో మదమున కోమలి చూచి, పిలిచిన యిద్దురాత్ముని బాహుగదాభి ఘాతమున, భగ్న ణాంతరంబున అనే మాటలు దుర్యోధనుని పొగరుబోతుతనాన్ని, దాన్ని ఓర్చుకోలేని భీమసేనుడి భీష్మప్రతిజ్ఞను, సామాన్యుడు కూడా అర్థం చేసుకోవడానికి అనుకూలంగానే ఉన్నాయి. అందులోనూ కోమలిని చూచి పిలిచిన అన్న మాటలు ప్రేక్షకులకు పద్యభావాన్నంతా పిడిచి ఇచ్చేట్టుగా ఉన్నాయి. "కురువృద్ధుల్" అన్న పద్యంలో కూడా ద్రౌపదినట్లు చేసిన ఖలు దుశ్శాసనున్ అన్న మాటలూ, రక్తౌఘము, ఉర్వీపతి చూచుచుండగా, ఆస్వాదింతున్ అన్న మాటలూ, అందులోని భావాన్ని సామాన్యులకు కూడా అనుభవానికి తెస్తున్నాయి.

నన్నయ గారి రచన ఇలా ఉంటుంది. కవిత్వంలో ఇదోరకమైన విద్య. అందులో నన్నయ విశారదుడు. అందుకే తిక్కన ఆయనను గురించి "ఆంధ్రకవిత్వవిశారదుడు" అన్నాడు. నన్నయ కవిత్వం పండితులనే ఉద్దేశించి వ్రాసింది కాదు. సామాన్యులు, పామరులు కూడా విని ఆనందించడానికి వ్రాసింది.


                                                ******

1 comment: