Tuesday, November 13, 2012

సూర్య స్తోత్రం (Soorya Sthotram)

 సంస్కృత వ్యాసభారతంలోని వేయి నామాలు కలిగిన సూర్యసహస్రనామస్తోత్రాన్ని నన్నయ గారు ఆంధ్రమహాభారతంలో కేవలం ఒక లయగ్రాహివృత్తంలో క్లుప్తీకరించి వ్రాసి, ఎల్లరూ నిత్యం పారాయణ చేసేందుకు వీలుగా, అరణ్యపర్వంలో నిక్షేపించారు. సూర్యపారాయణ వల్ల ఆయుర్ వృద్ధి కాగలదని ఆదిత్యహృదయం చెబుతున్నది.

లయగ్రాహి
"వారిరుహమిత్రు, నమరోరగ మునిద్యుచరచారణగణ ప్రణుత చారుగణు, లోకా 
ధారు, అఖిలశ్రుతిశరీరు హరి, శంకర సరోరుహభవ ప్రతిమున్ దారుణతమిస్రా 
వారణ మరీచి పరిపూరిత దిగంతరున్, భూరికరుణానిరతున్, సూరు, త్రిజగద్ర
క్షారతున్, సహస్రకరున్ కోరి భజియింపుము మనోరథఫలంబులగు భూరమణ నీకున్"

ధౌమ్యమహర్షి ధర్మరాజుతో, ఓ మహారాజా, పద్మాలకు మిత్రుడు, దేవతలు, పాములు, మునులు, ఆకాశంలో చరించేవారు, దేవ గాయకులైన చారణులు మొదలైనవారి చేత పూజింపబడేవాడు, సమస్త లోకాలకు ఆధారభూతుడు, సమస్తవేదరూపుడు, విష్ణువుతో, శివుడితో, బ్రహ్మదేవుడితో సమానుడు, ఘోరమైన చిమ్మచీకట్లను తన వేవెలుగులతో పోగొట్టి దిగంతరాలను ప్రకాశింపజేసేవాడు, గొప్ప దయాస్వరూపుడు, విజ్ఞాని, మూడులోకాలను రక్షించటానికి పూనిక గలవాడు, వేయికిరణాలు గలవాడైన సూర్యదేవుని, నీ మనోసిద్ధి కొరకై ప్రార్ధించుము అని చెబుతాడు. 

                                                                   *****

No comments:

Post a Comment