Sunday, November 18, 2012

దుర్యోధనుడు (Duryodhanudu)

స్థూలంగా సప్తవ్యసనాలు లేని వ్యక్తిగా మనకు మహాభారతంలో ఈయన గోచరిస్తాడు. కాని ఈ మహానుభావునికి ఉన్న ఒకే ఒక దుర్గుణం అసూయ. అది తల్లి నుంచి ఆయనకు సంక్రమించింది. తనకు లేదన్నది గాదు ఈయన బాధ, అవతలి వానికి ఉన్నదే అన్న వ్యథ పట్టి పీడిస్తుంది. మరణించిన వ్యక్తిగా ఈయన మహాభారతంలో కనబడతాడు. సంతాపసభలో ఈ సార్వభౌముని గురించి రెండు మంచి మాటలు చేబుతామంటే మొత్తం కావ్యంలో కాగడాతో వెదకినా దొరకడం చాలా కష్టం. ఒకవేళ వాటిని గురించి చేబుతామన్నా శ్రోతలు సమర్థించరు. సూక్ష్మంగా అన్నీ తెలిసిన మూర్ఖుడుగా ఈయన మహాభారత కావ్యంలో దర్శనమిస్తాడు. 

దుర్యోధనుడు అసూయాగ్రస్తుడు. తల్లి గర్భము నుండియే దుర్యోధనునకు అసూయాక్రోధములు, దురభిమానము సంక్రమించినవి. కల్యంశమున గాంధారీ ధృతరాషు్ట్రలకు అగ్రజుడుగా జన్మించాడని వ్యాసభారతం చెబుతున్నది.

బాల్యమాదిగా దుర్యోధనుడు మహారాజుకుమారుడుగా, 99 మంది తమ్ములకు అన్నగా, కాబోయే యువరాజుగా, భావి మహారాజుగా మన్ననలందుకొన్నాడు. మహావైభవంతో పెరిగాడు. పాండవుల హస్తిన ప్రవేశంతో పరిస్థితులు తారుమారైనవి. ఒక్కసారిగా ప్రజల, కురువృద్ధుల, కృపద్రోణాచార్యుల దృష్టి పాండవులపై మరలింది. పాండవులను, చదువులలోను, ఆటపాటలలోను అతిశయించుట అసాధ్యమని తెలిసింది. భీమునితో సమ ఉజ్జీ కాగల మల్లయుద్ధప్రావీణ్యం తాను సంపాదించుకున్నా, అద్వితీయ ధనుర్విద్యాపారంగతుడైన అర్జునునకు సాటిరాగల వీరుడు, తన పక్షాన లేడని దిగులుపడ్డ తరుణంలో కర్ణుని ప్రవేశంతో దుర్యోధనునకు కొండంత ధైర్యం కలిగింది. అంగరాజ్యమిచ్చి ఆదరించినాడు. శాశ్వతస్నేహాన్ని మహీనుతముగ పాటించి, కృతజ్ఞతాబద్ధుని గావించుకొన్నాడు. అర్జునుని వలన భయం తొలిగి ఆనాటి నుండి నిశ్చింతగా నిద్రించాడు.

నాటి కర్ణదుర్యోధనుల మైత్రి, కురుపాండవ కక్షలను ఘనీభవింపజేసి, మహాభారత కథాగమనమునే మార్చివేసింది. కురు మహాసంగ్రామానికే పునాదులు వేసింది. తుదకు శ్రీకృష్ణరాయభారం కూడా విఫలమైంది.

"ఏమును వారు, బంచికొని యేలుట కల్గదు, పల్కకుండు మిం
కేమియు వాడి సూదిమొన యించుక మోపిన యంతమాత్రయున్
భూమి యొనర్చి పాండునృపపుత్రుల కిత్తునె? యెవ్వరైన సం
గ్రామమునన్ జయంబుగొని రాజ్యము సేయుట నిశ్చయించితిన్" అని ఖండితంగా సభలో తేల్చి చెప్పినాడు. సంధి విఫలమై మహాభారత సమరం సిద్ధమైంది.

11 అక్షౌహిణుల సైన్యానికి అధిపతిగా భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, కృపాశ్వత్థామ వీరులు తన వెంటరాగా జయం తథ్యమని నమ్మిన రారాజు, 18 రోజుల యుద్ధానంతరం ఏకాకిగా మిగలగలడని ఎవరూహించగలరు? జయాపజయాలు దైవాధీనాలని తెలియని మూర్ఖుడు రారాజు. చివరకు ప్రాణరక్షణకై మడుగులో ఊరి చివర తలదాచుకోవలసిన స్థితి,  విధి వక్రించడమే కదా?

మడుగు వెడలి యుద్ధమునకు రమ్మని ఆహ్వానించు యుధిష్ఠిరునితో, "ఏ నింక సమరమొల్ల, మహీనాయక నీక యుర్వినిచ్చితి, శాంతిం గానకు జని వల్కలపరిధానుడనై తపమొనర్చెద మునుల కడన్"

ఓడి వచ్చినాడ నుద్ధతి నాకేల 
యుడుకుమాని నీవ యుర్వి యేలు
గుఱ్ఱములును నేనుగులు లేని బయలు
నీ తలనె కట్టికొనుము ధర్మతనయ!
(నాకింక యుద్ధం వద్దు. ఓ రాజా, ఈ భూమిని నీకిచ్చాను. శాంతంగా అడవులకు వెళ్లి మునుల సన్నిధిని నారచీరలు కట్టుకుని తపస్సు చేసికొంటాను. ఓ ధర్మరాజా, ఓడిపోయి వచ్చినాను. నాకెందుకయ్యా గర్వం! ఈ భూమిని నీవే పాలించుకొమ్ము - గుఱ్ఱాలు, ఏనుగులు లేని ఈ బీడును నీ నెత్తి పైననే కట్టుకొమ్ము). 
18 రోజుల క్రితం వాడి సూదిమొన మోపిన భూమి పాండవుల కివ్వనని ప్రతిన బూనిన రారాజు నోటనే యింత వైరాగ్యపు మాటలు వినటం, నిజంగా ప్రకృతిలో వింతల్లో వింత! అంతకు మునుపు, ఈ వైరాగ్యంలో నూరవ పాలున్నా ఇంతటి వినాశనం జరిగెడిది కాదు గదా! 
తొడలు విరిగి నేలబడిన దుర్యోధనుడు, చివరకు పాండవులను, శ్రీకృష్ణులను నిందించి, జీవితభోగానుభవమును గూర్చిన తృప్తిని ప్రకటించినాడు.

"చదివితి నెల్ల వేదములు, జన్మము లొప్పగ జేసితిన్, రమాస్పదమగు వృత్తి బొల్చి నరపాలకు లెల్లను గొల్వగంటి, దుర్మదరిపు గాఢగర్వ పరిమర్దనకేళి నొనర్చితిన్, దగం దుదినని మిత్రబాంధవులతో త్రిదివంబున కేగు టొప్పదే?"
(అన్ని వేదాలను చదివాను, యజ్ఞాలను విధి ప్రకారం చేశాను. సంపదలకు తావలమైన నడవడికతో బ్రతికాను. రాజులెందరో సేవించగా చూశాను. దురహంకారగర్వంతో ఉన్న రాజులను యుద్ధంలో జయించాను. తుదకు బంధువులు, స్నేహితులతోను కలసి స్వర్గానికి వెళ్లడం ఒప్పదా?)

అసూయక్రోధ దురభిమానవ్యక్తి వలన సంఘవినాశనం తప్పదని, దుర్యోధనుని పాత్ర మహాభారతంలో రుజువు చేస్తున్నది.

"జానామి ధర్మమపి జానా మ్యధర్మం
నైవతాదృక్ వచనరూప మధర్మమేవ జానామి"

(ధర్మమేమిటో నాకు తెలుసు కాని నా మనస్సు ధర్మమార్గంలో వెళ్లలేదు. అధర్మమంటే ఏమిటో కూడా తెలుసు. అది నన్ను విడిచి పెట్టడం లేదు.)

-అన్నీ తెలిసిన మూర్ఖుడు దుర్యోధన సార్వభౌముడు.


                                             ******

No comments:

Post a Comment