Tuesday, November 13, 2012

ఇంద్రద్యుమ్న మహారాజు (Indradyumna Maharaju)

 ప్రాణాయామ యోగ సాధనద్వారా జీవితకాలాన్ని ఎలా పెంచుకోగలమో తెలిపే విలక్షణమైన కథ ఇది.

ఇంద్రద్యుమ్నమహారాజు మరణించి పైలోకాలకు వెళ్లాక ఆయనకు నేరుగా స్వర్గలోకప్రవేశం లభిస్తుంది. కొంత కాలమైన తరువాత ఆయనకు పుణ్యలోకంలో గడువు పూర్తయిందని దేవతలు చెప్పేసరికి మహారాజుకు కోపం వస్తుంది. తను ఎన్నో పుణ్యకార్యాలు చేశానని ఇంకా భూలోకంలో తన గురించి చెప్పుకునేవారున్నారని వాదిస్తాడు. తన వాదాన్ని నిరూపించేందుకు భూలోకానికి వచ్చి తన రాజ్యంలో ఉన్న చిరంజీవియైన మార్కండేయ మహామునిని కలుసుకుని, తన గురించి ఆయనకేమైనా తెలుసునేమోనని ఆరా తీస్తాడు. అయితే మార్కండేయముని, మహారాజు గురించి తనకు వివరాలు తెలియవని చెప్పి, దగ్గరలో ఉన్న కొంగ, గుడ్లగూబ లాంటి పక్షుల వద్దకు తీసుకువెళ్లి, "మహారాజును గుర్తించారా?" అని వాటిని ప్రశ్నిస్తాడు. అయితే అవి కూడా ఆ మహారాజు గురించి తెలియదని చెబుతాయి. ఆ సరోవరం సమీపంలోనే ఉన్నఅకూపారుడనే తాబేలు మాత్రం కొంచెంసేపటికి జ్ఞాపకం తెచ్చుకుని, కన్నుల నుండి ఆనందబాష్పాలు రాలగా, గద్గదస్వరంతో ఇట్లన్నాడు.

"అయ్యో ఎంతమాట! ఆ ఇంద్రద్యుమ్న మహారాజునా నేను మరచిపోవటం, అతడు మహాత్ముడు. గొప్ప గుణాల చేత అలంకరింపబడినవాడు. పెక్కుమారులు ఆ మహనీయుడు నన్ను పెక్కు ఆపదల నుండి కాపాడినాడు. జనులలో శ్రేష్ఠుడై ఎంతో గొప్పతనాన్ని ఆర్జించిన ఆ ఇంద్రద్యుమ్నమహారాజుని నేను సదా కృతజ్ఞతతో స్మరించవలసివున్నది. మహానుభావుడైన ఆ రాజు ఎన్నో యజ్ఞాలు చేసి, దక్షిణగా అనేక గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ మహాత్ముడు దానం చేసిన వేలవేల ఆవుల గిట్టల రాపిడే కదా, లోకం పొగిడే ఈ మడుగు ఏర్పడటానికి కారణం!"
ఈ మాటలు వినగానే దేవతలు వచ్చి విమానం తెచ్చి ఇంద్రద్యుమ్నుడిని స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. అతడి కీర్తి లోకంలో శాశ్వతంగా నిలిచి ఉండేది, కాబట్టి స్వర్గలోకసౌఖ్యాలు శాశ్వతంగా అనుభవించవచ్చునన్నారు. అంటే, ఈ లోకంలో ఎవరి కీర్తి ఎంతకాలం నిలిచి ఉంటుందో, వారు అంతకాలం వరకు స్వర్గలోక సౌఖ్యాలను అనుభవిస్తారన్నమాట!

ఈ కథను విన్నవారికి, సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రాణాయామం (ఉచా్ఛ్వసనిశా్శ్వసాల ప్రక్రియ) విలువ ఇందులో అంతర్లీనమై ఉంది. మనిషి నిమిషానికి 15-18 సార్లు గాలి పీల్చి వదులుతున్నందున 100 సంవత్సరాలు జీవిస్తున్నాడు. తాబేలు నిమిషానికి నాలుగైదు సార్లు గాలిపీల్చి వదలడం వలన 200 ఏళ్లు బతుకుతున్నది.

యోగశాస్త్రప్రకారం:

తాబేలు 4-5/ నిమిషానికి  - 200 సం||
పాము 7-8/ నిమిషానికి -  150 సం||
మనిషి 15-18/ నిమిషానికి - 100 సం||
గుఱ్ఱం 20-22/ నిమిషానికి - 40 సం||
కుక్క 28-30/ నిమిషానికి - 14 సం||

మనిషి సగటున ఒకరోజుకు 21,600 మార్లు గాలి పీల్చి వదులుతున్నాడు. కానీ, ప్రాణాయామ యోగసాధన ద్వారా 7200 మార్లు మాత్రమే గాలిని పీల్చి వదిలి, జీవితకాలాన్ని 30-50 ఏండ్ల వరకు పెంచుకోగలుగుతాడు.

                                                 *****



No comments:

Post a Comment