Sunday, November 25, 2012

ధర్మబద్ధుడు పాండురాజు (Dharmabaddhudu Panduraju)

కురువంశము ప్రతిష్ఠింప, ధర్మసంపన్నుడై పాండురాజు అంబాలికకు వ్యాసుని వలన జన్మించాడని భారతకావ్యం చెప్తున్నది.

తాను రాజైయ్యు అంధుడైన అన్నగారిని ఆదరించి, గౌరవించి, ఆయనదే రాజ్యమన్నట్లు నడచుకొన్న తమ్ముడు పాండురాజు. వికలాంగుడైన అన్నను గౌరవించి, అతని పేరుమీద అన్ని వ్యవహారములు నడుపు తమ్ములు నేడు ఎందరున్నారు?

శాపగ్రస్తుడైన పాండుమహారాజు భార్య మాద్రి కౌగిలిలో ప్రాణాలు వదలడం ఎంత దురదృష్టకరం, ఎంత హృదయ విదారకమో, ఊహించండి.
నిండు యౌవనంలో ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యకరంగా లేదూ? మరి సప్తవ్యసనాలలో ఒకటైన వేటకు బానిసైన వ్యక్తి జీవితగాధ ఎంతో ఉత్కంఠభరితం.

మహాభారతంలో అనురాగమున్న అన్నదమ్ములు ధృతరాష్ట్రపాండుభూపతులు. తాను రాజయ్యు, అంధుడైన అన్నగారిని ఆదరించి, గౌరవించి, ఆయనదే రాజ్యమన్నట్లు నడుచుకొన్న తమ్ముడు పాండురాజు. రాజ్యము తనకు రాకపోయినను తమ్ముని ప్రభుత చూచి ఆనందించిన అన్న ధృతరాష్ట్రుడు.

వికలాంగుడైన అన్నను గౌరవించి అతని పేరు మీదనే అన్ని వ్యవహారాలు నడుపు తమ్ములు నేడు ఎందరున్నారు?
పాండురాజు అఖిలాస్త్రశస్త్రవిద్యలను గడించి విస్తృత దండయాత్రలు చేసి అపారధనరాసులు తెచ్చి ధృతరాష్ట్రుని వశం చేసేవాడు. బంధువులకు పంచేవాడు. మిత్రులకు అనుకూలంగా ఉంటూ, చేసిన కృషిని గుర్తించడంతో పండితులకు, దయ చూపటంతో దిక్కులేనివాళ్లకు, భయం లేకుండా చేయటంతో ప్రజలకు, సంతోషం కల్గించేవాడు.

పాండురాజు వంశకర్త. భావిచక్రవర్తుల వర్తనవిధిని ఆదర్శంగా ఆచరించి చూపించాడు. పాండురాజు తన వంశాన్ని, కుటుంబాన్ని సమైక్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఆదర్శవంతంగా ఉంచటానికి తన శక్తియుక్తులన్నీ ధారపోయగా, వంద అశ్వమేధాలు చేసిన ధృతరాష్ట్రుడు వంశవిచి్ఛతి్తకి దోహదం చేశాడు. పాండురాజు ప్రవర్తిల్ల చేసిన ఉదారచరిత్రను పాండవులు కొనసాగించారు. అందువలననే పాండవులు వంశోద్ధారకులైనారు. ధార్తరాష్ట్రులు నశించారు.

ఒకసారి పాండురాజు వేటకు వెళ్లాడు. ఆ రోజు వనంలో ఎక్కడా వేటకు మృగాలు దొరకలేదు. విసిగి వేసారిపోయాడు. ఒకచోట రెండు మృగాలు క్రీడిస్తుంటే (కిందముడనే ముని, తన భార్యతో కలిసి మృగరూపంలో క్రీడిస్తున్నాడు), చూచి వాటిని బాణాలతో కొట్టి చంపాడు. కిందముడు పాండురాజు వేసిన బాణాలు తగిలి చనిపోతూ, "నేను నా భార్యతో కూడినప్పుడు ఎలా చనిపోతున్నానో అలాగే నీవు నీ భార్యతో కూడినప్పుడు చనిపొతావు. నీ భార్య కూడ చనిపోతుంది" అని శపించి, ఆ ఋషిదంపతులు కన్ను మూశారు. పాండురాజు విషణు్ణడయ్యాడు. విరక్తుడు కూడా అయ్యాడు.

ఎంత సామా్రజ్యమున్ననేమి? ఎంత ఐశ్వర్యమున్న, ఎన్ని దిగ్విజయయాత్రలు చేసినా, ఎంత యౌవనమున్ననేమి? అనుభవయోగ్యలైన భార్య లెందరున్ననేమి? ఒక పురుషుడుగా అతని బ్రతుకు వ్యర్థమైనది.

పాండురాజు పెక్కు దానములు చేసి, తక్కిన సర్వమును ధృతరాష్ట్రునకు వదిలి మమత్వాహంకారవిముక్తుండై ధర్మపత్నులిరువురును తనపట్ల తపస్వినులై తోడురాగా ఆశ్రమవాసమునకేగినాడు.

అడవులకు వెళ్లునాటికి పాండురాజునకు పుత్రులు కలుగు అవకాశమే లేదు. శాపస్వభావ మట్టిది. అందుచేత మున్ముందు వచ్చు రాజ్యవారసత్వ విషయము ఆలోచింపవలసిన అవసరం గాని, ఆలోచింపగలిగిన మానసిక స్థితి గాని ఆ మహారాజునకు ఆనాడు లేదు.
శతశృంగ పర్వతం చేరి ఘోరతపస్సు చేయనారంభించాడు. అది బ్రహ్మలోకానికి వెళ్లే దారి. కొందరు మునులు బ్రహ్మలోకానికి పోతూ ఉంటే పాండురాజు వారితో తానూ వస్తానన్నాడు. కాని వారు నీకు సంతానం లేదు కాబట్టి మోక్షానికి అర్హత లేదని చెప్పారు. వారి మాటలు పాండురాజును మరీ క్రుంగదీశాయి.

సంతానాన్ని గురించి కుంతీమాద్రులతో కలిసి ఆలోచించాడు. దుర్వాసమహర్షి తనకిచ్చిన మహామంత్ర మొకటి ఉన్నదని, ఆపద్ధర్మంగా దానిని పుత్రలబ్ధికి వాడుకోవచ్చని కుంతి చెప్పింది. పాండురాజు అంగీకరించాడు. కుంతిని పుత్రసంతానం కొరకు మంత్రమహిమ నాశ్రయించుమని నియోగించాడు. అన్ని లోకాలు ధర్మం మీదనే స్థిరంగా నిలుస్తాయి. ధర్మదేవతను స్మరించుము. దేవతలలో ధర్మంలోను, సత్యంలోను అతడే పెద్దవాడు అన్నాడు.

"విశ్వం ధరతీతి ధర్మః" - లోకాన్ని ధరించేది ధర్మం. ఆ ధర్మానికి అధిదేవత ధర్ముడు. అతడిని స్మరించి సంతానాన్ని పొందటంలో పాండురాజు విశ్వశ్రేయోభిదృష్టి వ్యక్తమవుతుంది. ధర్మాన్ని రక్షించే సంతానాన్ని కోరటం ఉత్తమ గృహస్థు ధర్మం. పుట్టబోయే కొడుకు మూర్తికట్టిన ధర్మం కావాలని పాండురాజు సంకల్పం.

దిక్కులన్నీ వెలుగగా, చంద్రుడు జే్యషా్ఠనక్షత్రంతో కూడి ఉచ్ఛస్థితిలో ఉండగా, సూర్యాదిగ్రహాలు శుభస్థానాలలో ఉండగా అష్టమినాడు అభిజిన్ముహూర్త ప్రారంభంలో ధర్మదేవత అంశ చేత, శత్రువులను జయించగల పరాక్రమంతో ధర్మరాజు జన్మించాడు. (లోకాన్ని ధరించే ధర్మమే మూర్తి కట్టినవాడు). అతడు పుట్టినప్పుడు సర్వభూతములు సంతోషించాయి. ఆకాశవాణి ఇలా పలికింది - "ఇతడు కురుకులదీపకుడౌతాడు. ధర్మస్థిరమతి కావటం చేత "యుధిష్ఠిరుడు" అని పిలువబడతాడు".

పాండురాజు మరొక పుత్రుని పొందాలనే కోరికతో కుంతిని, వాయుదేవుని ఆరాధించి ఉత్తమజవసత్వుడైన కుమారుని పొందుమని అడిగాడు. ఆమె అలాగే చేసింది. వజ్రదేహుడైన, విక్రమోన్నతుడైన బాలుడు పుట్టాడు. దివ్యవాణి అతనికి "భీమసేనుడు" అని పేరు పెట్టింది.

అదేరోజున హస్తినాపురంలో దుర్యోధనుడు పుట్టాడు. కులాన్నీ, లోకాన్నీ నాశనం చేయగల దుశ్శకునాలు ఎన్నో పొడసూపాయి. అందరూ భయవిహ్వలులైనారు. కులనాశకుడైన దుర్యోధనుని ఒక్కడిని విడువుమని పెద్దలు ధృతరాష్ట్రునకు సూచించారు. అతడు పుత్రవ్యామోహంతో దాన్ని అంగీకరించలేదు.

అన్నకు వందమంది పుత్రులు కలిగారని తెలిసి, పాండురాజు త్రిలోకవిజయుడైన పుత్రుని కొరకు ఏకపాదం మీద నిలువబడి ఒక సంవత్సరకాలం ఇంద్రుడిని గురించి తపస్సు చేసాడు. దేవేంద్రుడు ప్రసన్నుడై "శత్రుక్షయాన్ని చేయగల మహావీరుడు నీకు కొడుకుగా పుడుతా"డని వరమిచ్చాడు. కృతార్థుడైన పాండురాజు, కుంతీదేవిని దేవేంద్రుని ఉపాసించమని కోరాడు. ఆమె అట్లాగే ఆరాధించింది. స్థిరపౌరుషుడు, లోకోత్తరుడు, వంశాకరుడు అయిన పుత్రుడు ఇంద్రాంశతో పుట్టాడు. ఆ సమయంలో దేవతలు, ఆ బాలుని భావికార్యాలను కీర్తిస్తూ పూలవానలు కురిపించారు. ఉత్తరఫల్గునీ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ బాలుడిని ఫల్గునుడనీ, అర్జునుడనీ పిలిచారు.

ఆ విధంగా, ధర్ముడిని ఆరాధించి సత్యాన్ని, ధర్మాన్ని, సర్వలోకంలో నిలుపగలవాడుగా మొదటి కొడుకు  ధర్మరాజుగా పొందాడు (లోకరక్షణ కొరకు). మహాబలశాలి అయిన భీముని వంశరక్షణ కొరకు రెండవవాడుగా పొందాడు.

త్రిలోకవిజయుడైన పుత్రుడు మాత్రమే ధార్తరాష్ట్రులకు దీటుగా నిలిచి పాండవప్రాభవాన్ని, లోకాధిపత్యాన్ని నిలుపగలడని పాండురాజు, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వరంతో మూడవ కొడుకును పొందాడు.

ముగ్గురు కొడుకులను చూచి పాండురాజు మూడులోకాలు జయించినట్లు పొంగిపోతుండేవాడు. మాద్రి కోరికపై కుంతిని ఒప్పించి దుర్వాసుని మంత్రప్రభావంతో మాద్రి చేత అశ్వినీదేవతలను ఆరాధింపచేసి కవల పిల్లలను పొందగలిగాడు. వారే నకులసహదేవులు. సౌందర్యపరాక్రమాలలో సాటిలేనివారు. ఇట్లా పంచపాండవులు పుట్టి శుక్లపక్షచంద్రబింబాలవలె పెంపొందుతూ ఉన్నారు.

అంతలో ఒక విపత్తు, వసంత ఋతువు వచ్చింది. ప్రకృతి శోభ మానవహృదయాలను ఉప్పొంగజేస్తున్నది. ఒకనాడు కుంతి అన్నదానవ్రతంలో నిమగ్నురాలై ఉన్నది. మాద్రి ఒక్కతే పాండురాజు పక్కన ఉన్నది. ఆమె మనోహరరూపం, వసంతప్రభావంతో అతని మనస్సు నాకర్షించింది.

"చారు సువర్ణహాసి నవచంపకభూషయు సింధువారము
క్తార రమణీయయున్ వకుళ దామవతంసయునై యపూర్వశృం
గారవిలాసలీల యొసగన్ తన ముందట నున్న మాద్రినం 
భోరుహ నేత్ర జూచి కురుపుంగవు డంగజ రాజుమత్తుడై"

-అందంలో బంగారాన్ని మించిన క్రొత్త సంపెంగపువ్వులే ఆభరణాలుగా కలదై, వావిలిపూలనే ముత్యాల చేత మనోహరమైనదై, పొగడ దండలు చెవి ఆభరణాలుగా కలదై, అంతకు ముందెన్నడూ లేని శృంగారవిలాసంతో, తన ముందున్న కమలాల వంటి అందమైన కన్నులు గల మాద్రిని చూచి కురుశ్రేష్ఠుడైన పాండురాజు మన్మథరాగవశుడై-

సహజంగానే సౌందర్యవతి అయిన మాద్రికి వసంతపుష్పాలంకారాలు (సంపెంగలు, వావిలిపూలు, పొగడలు) అమితమైన శోభను కల్గించాయి, ఆమె రూపం ఆనాడు పాండురాజునకు మత్తెక్కించింది.

పాండురాజు కిందమ ముని శాపం మరిచాడు. ఆ శాపం గుర్తున్న మాద్రి, ఎంతో భయంతో, దుఃఖంతో, తనను వారిస్తున్నా బలాత్కారంగా ఆమెతో సంభోగసుఖాన్ని పొందగోరి కౌగలించుకొని ప్రాణాలు కోల్పోయాడు.

"ఎట్టి విశిష్టకులంబున బుట్టియు సదసద్వివేకములు గల్గియు మున్ గల్గిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండ నేర్తురే మనుజుల్"

-మానవులు ఎంతటి ఉత్తమవంశంలో పుట్టినా, మంచిచెడ్డల గురించి పరిజ్ఞానాలు కలిగి ఉన్నా, పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు!

విధి కంటే కర్మ బలీయమని సుభాషితం. ఫలం కర్మాధీనం కాబట్టి దేవతలతోను, దైవంతోను మాకేమి పని? దేవతలకు కూడా శక్యం కాని కర్మకే నమస్కారం అంటాడు భర్తృహరి.

           
                                         ******

No comments:

Post a Comment