Sunday, November 18, 2012

కృష్ణద్వైపాయనుడు (Krishnadwaipaayanudu)

"వ్యాసో నారాయణో హరిః" అంటారు.  
కారణజన్ముడు. పరాశర మహర్షికి, సత్యవతికి సద్యోగర్భమున జన్మించిన ముని సత్తముడు. జన్మించిన వెంటనే ఆయన జ్ఞానియై, తపోమార్గంలోనే మనసు నిలిపాడు. భూత, భవిష్య, వర్తమానములను ఎరిగిన తపోధనుడు. 
భారత యుద్ధభూమిలో చచ్చిన మృతవీరులను సజీవంగా సశరీరులుగా నిల్పిన మహనీయుడు. గాంధారి గర్భపాతమైన మాంసపేశిని  101 భాగాలుగా విభాగించి ప్రాణం పోసిన అపరబ్రహ్మ. ఇది ఎలా సాధ్యం?

పరాశరమహర్షికి, సత్యవతి యందు సద్యోగర్భమున జన్మించినవాడు వ్యాసుడు. నల్లని రంగు కలిగి, యమునా ద్వీపమున జన్మించుటచే ఈయన కృష్ణద్వైపాయనుడనీ, వేదములను నాలుగుగా విభజించుట చేత వేదవ్యాసుడని పేరు గాంచినాడు. జన్మించిన వెంటనే ఆయన జ్ఞానియై తపోమార్గంలోనే మనసును నిలిపినాడు.

వ్యాసుడు జింకచర్మవస్త్రంతోను, ఎర్రని జడలతోను, దండకమండలాలు ధరించి, తల్లి ముందు నిల్చి ఆమెకు మొ్రక్కి "మీకు పని కలిగినప్పుడు నన్ను తలవండి, ఆ క్షణమే నేను వస్తాను" అని చెప్పి, లోకహితానికై తపోవనానికి వెళ్లి, భయంకర తపస్సులో నిమగ్నుడైన మహనీయుడు.

ఆజన్మ మునివృత్తినవలంబించిన వ్యక్తి సంసారబంధమున చిక్కుబడుట దైవఘటన. ప్రబలకారణముచే మహాత్ములడుగు వేసినను, వెంటనే, అందుండి బయటపడుదురు. అది వారి వ్యక్తిత్వసామర్థ్యము. తల్లి కోరికపై వ్యాసుడు విచిత్రవీర్యుని భార్యలతో కలయవచ్చి, ధృతరాష్ట్ర-పాండు-విదురులకు తండ్రి కావలసి వచ్చింది. అట్లని ఆ మహర్షి సంసారసుఖముల తగులుకొనలేదు. అయినను సంసార సాంగత్య మాయను వదలలేదు. ఆజన్మాంతము సంసారమునకు దూరముగ మునిజీవితమునే గడిపినాడు. అవసరమైనప్పుడు అవసరమైనవారికి హితముపదేశించినాడు. మాట సహాయము చేసినాడు.

ధృతరాష్ట్ర-పాండు-విదురులు పుట్టిన తర్వాత హస్తినను విడిచి వెళ్లిన కృష్ణద్వైపాయనుడు గాంధారి కడుపును బాదుకొన్నప్పుడు మరల అక్కడికి వచ్చినాడు. ("గాంధారి మనస్తాపంబున ఉదరదాడనము జేసికొని గర్భపాతంబగుడును").

గర్భపాతమైన ఆ మాంసపుముద్దను 101 ముక్కలుగా చేసి, వేర్వేరుగా వాటిని నేతికుండలలో పెట్టి, చన్నీళ్లతో తడుపుతూ ఉండమని, వాటి నుండి 100 మంది కుమారులూ, ఒక కుమార్తె పుట్టుతారని చెప్పి వెళ్లగా, గాంధారీధృతరాషు్ట్రలు ఆయన చెప్పిన ప్రకారం చేయించి, దుర్యోధనాది నూర్గురు కుమారులనూ, దుస్సల అనే కుమార్తెనూ పొందారు. వారికి పుత్రభిక్ష పెట్టినది వ్యాసుడే.

నిజంగా వ్యాసుడు మాంసపేశిని ఎలా విభజించి పుత్రులే కలుగుతారని చెప్పగలిగాడు? ఆయన చేసిన శస్త్రచికిత్స ఎలా జరిగింది?  ఊహించటానికి కూడా సాధ్యం కానిది. వర్తమానంలో నేటికీ వైద్యులు గర్భచ్యుతి అయిన మాంసపేశికి ప్రాణం పోయలేకపోతున్నారు. మరి ఆ మహర్షి విభజించిన గర్భపాతానికి ప్రాణం ఎలా పోయగలిగాడు? ఊహించలేని మహాద్భుతం!

భావికాలంలో జరుగబోయే వినాశనాన్ని కూడా ఆయన ఎలా చెప్పగలిగాడో, ఏ జ్యోతిష్కుడూ కూడా నిర్ధారించలేడు. తల్లి సత్యవతితో వ్యాసుడు-

"క్రూరులు, విలుప్తధర్మాచారులు ధృతరాషు్ట్రసుతులు, అసద్వ్రత్తులు, నిష్కారణవైరులు, వీరల కారణమున నెగ్గు పుట్టు కౌరవ్యులకున్"

-ధృతరా
షు్ట్రని కుమారులు దుర్మార్గులు. నశించిన ధర్మబద్ధమైన నడవడి గలవారలు, మంచి కాని పనులను ఆచరించు స్వభావం గలవారు. కారణం లేకుండానే వైరం వహించేవారు. వీరి కారణంగా కౌరవవంశానికి కీడు కలుగుతుంది. భవిష్యత్తును ఇంత చక్కగా విశ్లేషించిన ఋషిపుంగవుడు వ్యాసుడు నిజంగా ధన్యుడు!

పాండవులకు లాక్షాగృహదహనమొక చావు దెబ్బ! ఏదో దైవానుగ్రహమున, విదురుని సాహయ్యమున వారు బ్రతికి బయటపడినారు. ఎంత వ్యక్తిత్వమున్నవారైనను, ఇట్టి దెబ్బకు క్రుంగిపోవుట సహజము. జీవితములో ఒక నిస్సహాయత, నిస్ప్ృహ  ఆవరించి, వారి ఉత్సాహము కొడిగట్టి వెలుగు తగ్గును. ఈ దశలో ఎవ్వరైనా వారి నోదార్చి ధైర్యము చెప్పుట చాలా మంచిది. వ్యాసమహర్షి ఈ అవసరము గుర్తించినాడు. లాక్షాగృహదహనము నుండి బయటపడి, హిడింబుని ప్రమాదమును తప్పించుకొని శాలిహోత్రుని ఆశ్రమము చేరిన పాండవులను కలుసుకొన్నాడు.

మనుమలను దీవించి కౌగిలించుకొని, బాష్పపూరితనయనయై మొ్రక్కిన కోడలు కుంతి నోదార్చి, "నీ కొడుకు యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు. అతడు నారాయణుని భుజాలవంటి నలువురు తమ్ముల బలం చేత, రాజులందరినీ శాసించి, సార్వభౌముడు చేసే రాజసూయ, అశ్వమేధాదియాగాలు చేసి, తాత తండ్రుల రాజ్యం ఏలగలుగుతాడు. కురువంశాన్నంతటినీ పవిత్రం చేస్తాడు" అని వారి శోకాన్ని ఉపశమింపజేశాడు.

దెబ్బ తిని క్రుంగిపోవు దీనులకు ఇంతకంటే కావలసినది ఏమున్నది?

ఆశ్రమవాసమున, గాంధారీధృతరాషు్ట్రల కడుపు కోతను, కుంతీదేవి మనోవ్యథను, వ్యాసుడు కనిపెట్టినాడు. తన దివ్యశక్తిచే గంగాజలమున మృతవీరులందరూ కనిపించునట్లు చేసినాడు. ఆ మువ్వురికి మనశ్శాంతిని ప్రసాదించినాడు.
వివరాలకు వెళితే...
నగరవాసులు, పల్లెవాసులతో సహా ధృతరాషు్ట్రలందరూ కదలి గంగ వద్దకు వెళ్లారు. వ్యాసమహర్షి గంగాజలంలో మునకవేసి, ప్రేమతో తియ్యనైన గొంతుతో, "ఇక్కడికి (మహాభారతయుద్ధంలో మరణించినవారిని) రండీ!" అన్నారు. అపుడు ఆ నీళ్లలో దుర్యోధనుడూ, అతని తమ్ములూ, ఆ ధార్తరాషు్ట్రల కొడుకులూ, మొదలైన ఆ కుటుంబం వారు, అభిమన్యుడు, ఉపపాండవులు మొదలైన పాండవకుటుంబంవారు, కర్ణుడు, ద్రుపదవిరాటులు, వాళ్ల చుట్టాలు, శకుని, భీష్మ ద్రోణులు మొదలైనవాళ్లు తమ దివ్యశరీరాలు ప్రకాశిస్తుండగా కనబడ్డారు. తన తపః ప్రభావాన్ని చూచి జనమంతా ఆశ్చర్యపడే విధంగా వ్యాసుడు ఆ ధృతరాషు్ట్రనకు సంపూర్ణదృష్టిని ఇచ్చాడు.

భర్తకు చూపు రావటం విని గాంధారి, ఆశ్చర్యానందాలతో, తాను కూడా కళ్లకు కట్టిన వస్త్రాన్ని తొలగించి దుర్యోధనాదులు చూస్తుండగా వారంతా కలిసి తమ ఉదారబుద్ధిని ప్రకటిస్తూ, ధృతరాషా్ట్రదుల సమీపానికి వచ్చారు. వీరంతా అక్కడ ఉన్న చుట్టాలందరకు అత్యుత్తమమైన ఆనందం కలిగించి, చేయవలసిన సత్కారాది ఆచారాలు చేసారు.

ఆ రోజంతా వాళ్లు అందరూ తమ ఇష్టం వచ్చినట్లుగా కలసిమెలసి వ్యవహరించారు. ఆ విధంగా దివ్యులు మానవులతో స్వస్వరూపంతో వచ్చి కలసివుండటం, అందరినీ ఆశ్చర్యప్రవాహంలో ముంచింది. మునిశ్రేష్ఠుడైన ఆ వ్యాసుని మహిమ ఏమని చెప్పటం?

మర్నాడు ఉదయాన్నే వ్యాసుని నియోగం మీద రెండు విధాలైనవారు (దివ్య దుర్యోధనాది, మానుషధృతరాషా్ట్రది దేహులు) పరస్పరం వీడ్కోలు తీసుకున్నారు. దివ్యదేహులైన ఆ వీరులు ఎవరి లోకాలకు వారు వెళ్లటం కొరకు గంగాజలంలోకి దిగి అంతర్థానమయ్యారు.

ఫలశ్రుతి:
ఈ వృత్తాంతాన్ని విన్నా, చదివినా ఆ జనులకు ఈలోకంలోనూ, పరలోకంలోనూ అనేక విధాలుగా అత్యుత్తమమైన కోర్కెలు నెరవేరుతాయి. మనసారా సంతోషం కలిగేటట్లు తమ తమ బంధువులను కలుసుకొనే ఆనందకరమైన స్థితిని వారు పొందుతారు. వారి రోగాలు తొలగుతాయి. తిరుగులేని ఆనందం, అధిక శుభాలు కలుగుతాయి.

భూతభవిష్యవర్తమానాలను తెలుసుకొన్న మహనీయులు వ్యాసమహర్షి. వీరినే క్రాంతదర్శులంటారు.

ఆయననే "వ్యాసాయ విష్ణురూపాయ" అన్నారు పెద్దలు. కురుపాండవ కుటుంబ గాధ మానవస్వభావ సమగ్రచిత్రణకు, లోకపు పోకడ ప్రదర్శనకు, ధర్మతత్వ నిరూపణకు, ఎంతో అనుకూలమని ఎంచి, మూడు సంవత్సరములు కృషి చేసి మహాభారతగ్రంథముగ రూపొందించి, మానవలోకమునకు అందించినవాడు వ్యాసమహర్షి.

                                         ******

No comments:

Post a Comment