Sunday, November 25, 2012

భగవంతుడు మెచ్చిన భీష్మాచార్యుడు (Bhagavanthudu Mecchina Bheeshmacharyudu)

మహాభారత కథలో ప్రతిష్ఠాత్మకమైన పాత్ర భీష్మునిది. గంగాశంతనుల కుమారుడైన దేవవ్రతుడు, తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచారుడిగా ఉండిపోతానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. ఇచా్ఛ మరణం వరంగా పొంది, కాలం యొక్క ప్రాముఖ్యమును (ఉత్తరాయణ పుణ్యకాలం) లోకానికి తెలియజేశాడు.

అష్టమ వసువు అంశతో జన్మించినవాడు భీష్ముడు. పుట్టగానే శిశువును తీసుకువెళ్లిన గంగాదేవి యౌవనుడైన కుమారుణ్ని తండ్రికి అప్పగిస్తూ ఓ రాజా ఇతడు వశిషు్ఠని వద్ద వేదాలను పూర్తిగా నేర్చుకున్నాడు. శుక్ర, బృహస్పతులు నేర్చుకున్న సకల ధర్మశాస్త్రాలను నేర్చాడు. శ్రేష్ఠమైన అస్త్రాలను ప్రయోగించడంలో పరశురామునితో సమానుడు. ఆత్మజ్ఞానంలో సనత్కుమారాదులంతటి పుణ్యాత్ముడు, అని భీష్ముని సుగుణాల గురించి వివరిస్తుంది.

ఉత్తరగోగ్రహణ యుద్ధ సమయంలో అర్జునుడు ఉత్తరునికి తన తాత భీష్ముని పరిచయం చేస్తాడు:
"మా తాత అయిన భీష్ముడు గొప్ప పరాక్రమం గలవాడు. శత్రు పక్షాన ఉన్న గర్వమనే అరణ్యాన్ని తన ప్రతాపాగ్నిజ్వాల చేత భస్మీపటలం చేయగల సమర్థుడు. కురుపాండవుల హితం కోరేవాడు. ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు. కాబట్టి కౌరవులకు సహాయపడుతున్నాడు. అంతేగాని ప్రత్యేకించి కౌరవ పక్షపాతి మాత్రం కాడు" అని అంటూ తమ తాత భీష్ముని మంచితనాన్ని తెలుపుతాడు అర్జునుడు.

కౌరవ సైన్యాధ్యక్షునిగా పదిరోజులు పోరాడిన తరువాత భీష్ముడు జీవితంపై విరక్తి చెందుతాడు. అందుకే తన ఇష్టానుసారం మరణించే వరాన్ని పొందిన భీష్మాచార్యుడు తనను చంపమని అడిగి మరీ హత్య చేయించుకున్నాడు. పాండవులకు తన పరాజయ రహస్యం తెలిపి తనువును అంపశయ్యపై దాల్చి, త్యాగమయ చరిత్ర సృష్టించిన మహామనీషి.

పాండవులతో సంధి చేసుకుని సౌఖ్యంగా జీవించుమని భీష్ముడు కౌరవులకు చేసిన విజ్ఞప్తి బూడిదలో పోసిన పన్నీరయింది.

శ్రీకృష్ణుని ఆజ్ఞమేరకు తన ధర్మజ్ఞానాన్ని ధర్మరాజుకు బోధిస్తాడు.

కన్నుమూసే క్షణంలో శ్రీకృష్ణుని సంబోధిస్తూ భీష్ముడు - 

"బలము నీవ నాకు, భక్తుడ నీయెడ
ఆలుబిడ్డలు లేని యట్టివాడ
కావు నన్ను అధిక కారుణ్యమున
నిమ్మనుజ్ఞ కమలదళ మనోజ్ఞ నయన"

ఆ మూగ వేదన ఆయన జీవితకాలంలో ఎప్పుడు కూడా పొరపాటునైనా బయటకు రాలేదు. అంత జాగ్రత్తగా బ్రతుకు వెళ్లదీసుకున్న భీష్ముడు చివరి క్షణంలో భగవంతుని ముందు తన చిత్తంలో అట్టడగు పొరకింద ఉన్న అనుభవైక్య వేద్యమైన జీవన సంస్కార లక్షణాన్ని బయటకు తీశాడు. భార్యాపిల్లలు లేని జీవిత దుర్భరత్వాన్ని భీష్ముడు అనుభవించాడు. జీవితం పరిపూర్ణం కావడానికి ఆలుబిడ్డలు కావలెనని భావించాడు. భీష్ముని కంటే ఆత్మజ్ఞాని ఎవరు?

ఇంతటి మనోవేదనకు కారణమేమై ఉండవచ్చు? సకల రాజ సమక్షంలో నిండుసభలో రాజసూయ యజ్ఞానంతరం శిశుపాలుడు భీష్ముడిని నిందిస్తూ పలికిన పలుకులే, ఆయన జీవిత పర్యంతం వెంటాడి ఉంటాయి.

"జన నిందితమైన నీ యందనపత్యత 
యను యధర్మమది యుండగ
ధర్మనివృత్త చరిత్రక, నీయనుశాసన 
మెట్లు నమ్మనగు జనములకున్"

"భీష్మా! సంతానం పొందడం అనే ధర్మం నీలో లేదు. కాబట్టి బిడ్డలను పుట్టించలేనివాడివైన నీ ఆజ్ఞను జనులెట్లా శిరసావహిస్తారు?"

సంస్కృత భారతంలో-
"మోహంతో వీరంతా నిన్ను ధర్మజ్ఞుడంటారు. మహాప్రాజ్ఞుని వలె బ్రహ్మచర్యమనే మిషతో నీ తమ్ముని భార్యకు నీవుగాక ఇతరుడు పుత్రులను కన్నాడు (వ్యాసుని వలన ధృతరాష్ట్రుడు, పాండురాజుల జననం). ఇది, ఒక మహాబ్రహ్మచర్య నిష్ఠయా? మోహం వల్లనో, నపుంసకత్వం వల్లనో బ్రహ్మచర్య నిష్ఠను పూనావు, కాని ధర్మములను తెలుసుకుని, వాటిని అనుసరించేవాడివై ఈ దీక్షను చేపట్టిన వాడివికావు. కాబట్టి నీవు సాధువుల సేవచేసి పెద్దల వలన బుద్ధులను పొందలేదు. దానము, అధ్యయనము, యజ్ఞాచరణ, వ్రతానుష్ఠానం, ఉపవాసాలు సంతానము కలుగుటలో పదహారవపాలు కావు. సంతతి లేనివారి ధర్మబోధ నిరర్ధకం" అని శిశుపాలుడు భీష్ముని నిందిస్తాడు.

తాత్విక చింతన, ధార్మికానుష్ఠానం, దృఢభక్తి, ఇంద్రియ నిగ్రహం, ఇన్ని సులక్షణాలు రాశి పోసుకున్న కారణంగా భీష్ముడు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. ధర్మానికి, భక్తికి, సనాతన దివ్యజీవనానికి ఆచార్యుడు అయ్యాడు. యావద్భారత జాతి సంస్కరింపదగినవాడు భీష్ముడు. అందుకే ఆయన పేరున ఒక పర్వమే ఏర్పడింది.

భీష్మ పితామహుని పతనానంతరం ధర్మరాజు...

"అకట తండ్రి సచ్చినంత నుండియు మమ్ము నరసి బ్రోచినట్టి యనుగుతాత 
జంపమదిదలంచుతెంపు చూచితె రాజధర్మ మింత క్రూరకర్మమగునె" అంటూ వాపోతాడు.

ధన్యజీవి భీష్ముడు. అల్పుడైన శిశుపాలుని దృష్టిలో భీష్ముని త్యాగం ఎటువంటి విపరీత అర్థాలకు బీజమయిందో విజ్ఞులే నిర్ణయించాలి.


                                                 ******

No comments:

Post a Comment