Monday, October 8, 2012

తన పేరున్న కన్యతో పెండ్లి! (Thana Perunna Kanyatho Pendli)

తన పేరున్న అమ్మాయినే జరత్కారు మహర్షి ఎందుకు వివాహమాడ దలచాడు? అన్న ప్రశ్నకు పండితులే సమాధానం చెప్పాలి. తపస్సే ధ్యేయంగా శరీరాన్ని కృశింపజేసి, సంసార పునర్భవ భీతి చేత కఠోర బ్రహ్మచర్య వ్రతావలంబి జరత్కారువు. పితృపితామహుల కోరికపై సనామధేయ యగు నాగకన్యను వివాహమాడి, నియమం పాటించని భార్యను వదిలి తపశ్చర్యకే పునరంకితమైన మహా మనీషి. 
కారణజన్ముడైన ఆస్తీక మహర్షి (జరత్కారు తనయుడు) సర్పసంహార యాగాన్ని తల్లి, మేనమామల కోరికపై నిలుపగలిగాడు. 
లోకానికి ఈ కథ అందించే మహత్తర సందేశం: 
"పుత్రవంతులగు వారు పొందునట్టి లోకములను గొప్పతపస్సు, గొప్ప యాగములు చేసియు, పుత్రులు లేనివారు పొందజాలరు. (అపుత్రస్య గతిర్నాస్తి)"

ఇలాంటి కథ ఎప్పుడైనా, ఎవరైనా చెప్పగా మీరు విన్నారా? 
ఆంధ్రమహాభారత, ఆదిపర్వంలో సర్పసంహారయాగ సందర్భంగా ఇందుకు సంబంధించిన కథ మనకు కనబడుతుంది. వివరాలలోకి వెళితే..
జరత్కారుడనే ముని సంసారపునర్భవభీతి చేత (సంసారము నందు మళ్లీ జన్మ కలుగుతాదనే భయం వలన) తపస్సు, వేదాధ్యయనము, బ్రహ్మచర్యవ్రత దీక్షలతో శరీరాన్ని కృశింపచేసిన మహనీయుడు. ఒకనాడు అడవిలో ఒక నీటి పడియను చూచి, అందు ఎలుకలచే కొరకబడి ఒక్క వేరు మాత్రమే మిగిలి ఉన్న అవురుగడ్డి దుబ్బును పట్టుకొని తలక్రిందులుగా సూర్యుని కిరణాలే ఆహారంగా వ్రేలాడుతున్న కొందరు ఋషులను చూచి, "ఇది తపోవిశేషమా? నాకు వివరించండి" అని ప్రశ్నించాడు. 

అప్పుడా ఋషులు, "అదృష్టహీనులమైన మా వంశంలో జరత్కారుడనే పాపాత్ముడు పుట్టి, పెండ్లి చేసుకొనటానికి, సంతానం పొందటానికి అంగీకరించకున్నాడు.  మేమాతని తండ్రితాతలం. మేము పట్టుకు వేలాడుతున్న అవురుగడ్డి దుబ్బు వ్రేళ్లనన్నింటిని యముడు ఎలుకల మిషతో కొరికేస్తే ఒక్కవేరు మాత్రం మిగిలి ఉన్నది. జరత్కారుడు సంతానం పొందకపోతే ఆ వేరు కూడా తెగిపోతుంది. అప్పుడు మేము అధోలోకాలలో పడతాం. అతడు సంతానం పొందితే పైలోకాలకు వెళతాం. నీవు ఎవరో మాకు బంధువువలె ప్రీతితో ఏకాగ్రచిత్తుడవై మా మాటలు విని మన్నించావు. ఆ జరత్కారుడిని ఎరుగుదువేని మేం పొందే ఈ దురవస్థ వానికి తెలియజెప్పుము" అన్నారు. 

పితృదేవతలిట్లు పలుకగా జరత్కారుడు మిక్కిలి దయతో కూడిన హృదయం గలవాడై, "నేనే ఆ జరత్కారుడను, మీ కుమారుడను, నేను తప్పక మీరు కోరినట్లుగా వివాహం చేసుకుంటా" నని మాట ఇచ్చాడు. ఆ మహామునులు సంతోషించి జరత్కారునితో - 
"తగియెడు బుత్రులం బడసి ధర్మము తప్పక తమ్మునుత్తముల్ 
పొగడగ, మన్మహామతులు పొందు గతుల్ గడు ఘోరనిష్ఠతో
దగిలి తపంబు సేసియును దక్షిణలిమ్ముగ నిచ్చి యజ్ఞముల్ 
నెగడగ జేసియుం, బడయనేర రపుత్త్రకులైన దుర్మతుల్" అన్నారు. 

యోగ్యులైన కొడుకులను పొంది, ధర్మమార్గం తొలగకుండ తమ్ము, సజ్జనులు పొగడేటట్లుగా జీవించి, గొప్ప బుద్ధిమంతులు పొందే ఉత్తమలోకాలను, మిక్కిలి కఠినమైన నిష్ఠతో విడువక తపస్సు చేసినప్పటికీ, ఒప్పుగా దక్షిణలిచ్చి యజ్ఞాలు అధికంగా చేసినప్పటికీ పుత్రహీనులైన దుర్జనులు (అట్టిగతులు) పొందజాలరు". 

జరత్కారుడు పితృదేవతలకు, తాను తనతో సమానమైన పేరు గల కన్యను పెండ్లాడవలెనను తలంపుతో నున్నాడనని చెప్పి, వారి వద్ద సెలవు తీసుకొని అట్టి కన్యను భూవలయమంతా తిరిగి వెదికినా లభించలేదు, కాని ముసలితనం మాత్రం సంప్రాప్తించింది. 

సర్పరాజైన వాసుకి తన సేవకుల వలన విషయాన్ని తెలుసుకుని, తన తోబుట్టువయిన (నాగకన్య), జరత్కారువును వెంటతీసుకొని జరత్కారుని చెంతకు వెళ్లి, "లోకపూజ్యుడా! జరత్కారు మహర్షీ! మీ వంశం పుణ్యవంతమయింది. మా వంశం ధన్యమయింది. నీకూ, మా చెల్లెలికిని ఉండే ఒండొరులకు తగిన గుణాల చేత, పేర్ల చేత హృదయంలో ఆనందం కలిగింది. నా చెల్లెలైన ఈ జరత్కారువును వివాహార్థమై కన్యారూపమైన భిక్షగా ప్రీతితో గ్రహించండి" అని పలుకగా, జరత్కారు మహాముని ఆ కన్యను పెండ్లాడి మొదటి సమాగమము నాడే భార్యకు, "నాకు నీవు ఎప్పుడు అగౌరవం తలపోస్తావో ఆ రోజుననే నిన్ను విడిచిపోతాను" అని నియమం చేసాడు. 

ఆనాటి నుండి "వాలుపయి నడచునట్లబ్బాలిక నడునడ నడుంగి భయమున నియమాభీలుడగు పతికి పవళుల్ రేలును నేమఱక  పరిచరించుచునుండెన్".  

కన్య అయిన ఆ జరత్కారువు కత్తిపై నడుస్తున్నట్లు వడవడ వణికి భయంతో నియమం చేత భయంకరుడైన భర్తకు పగళ్లు రాత్రులు పొరపాటు పడకుండ శ్రద్ధతో సేవ చేస్తూ ఉండేది. 
"అనవరతభక్తి బాయక తన పతికిం బ్రియము సేసి తద్దయు గర్భం బనురక్తి దాల్చి, యొప్పెను, దినకరగర్భయగు పూర్వదిక్సతి వోలెన్". 
ఎడతెగని భక్తితో విడువక తన భర్తకు మిక్కిలి ప్రీతి ఒనరించి, అనురాగంతో గర్భం ధరించి, సూర్యుడు గర్భంలో ఉన్న తూర్పుదిక్కు అనే కాంతవలె ప్రకాశించింది. 

ఒకనాడు జరత్కారుముని, తన భార్య తొడనే తలగడగా కృష్ణమృగచర్మపు పక్కపై నిద్రిస్తున్న సమయంలో సూర్యుడు అస్తమించుటకు సిద్ధంగా ఉండగా, ఆశ్రమంలో నివసించే ఋషులు సంధ్యాకాలంలో చేయదగిన సంధ్యావందనాదికర్మలు చేయటానికి పూనగా చూచి సంధ్యాకాలంలో చేయవలసిన సత్కర్మలు లోపిస్తే ధర్మభంగమవుతుందని, ఒకవేళ మేల్కొల్పినందుకు కోపిస్తే కోపాన్ని భరించవచ్చునని తలచి భర్తను నిద్ర నుండి లేపింది. కోపించిన భర్తకు కారణం తెలుపగా,

"నా మేల్కను నంతకు నుండక యిను డొనరగ నస్తాద్రి కేగ నోడడె చెప్పుమా". నేను మేల్కొనేంతవరకు అస్తమించకుండ ఉండక సూర్యుడు పడమటి కొండకు వెళ్లటానికి భయపడడా అంటూ భార్యను మందలించాడు. తన శపథాన్ని భార్యకు గుర్తు చేస్తూ, గర్భాన ఉన్న కుమారుడు సూర్యాగ్ని తేజస్వి అని, ఇరువురి కులాల దుఃఖ నివారకుడని ఓదారుస్తూ తన అన్న చెంతకు వెళ్లుమని జరత్కారముని తపస్సు నిమిత్తం అడవికి వెళ్ళాడు.
కొంత కాలానికి:
ఆపూర్ణతేజుడు - అంతటను నిండిన తేజస్సు గలవాడు. 
అపగతపాపుడు - పాపం లేనివాడు
అపాకృతభవానుబంధుడు - తిరస్కరింపబడిన సంసార బంధం గలవాడు. 

నిజ మాతృ, పితృ పక్ష ప్రబల భయాపహుడు - తల్లిదండ్రుల ఉభయపక్షాలకు చెందినవారి అధికమైన భయాన్ని పోగొట్టేవాడున్ను అయిన ఆస్తీకుడు కాంతితో పుట్టి పెరిగాడు. ఆయన చ్యవనకుమారుడైన ప్రమతి వద్ద వేద వేదాంగాలను, సకల శాస్త్రాలను అధ్యయనం చేసాడు.

కారణజన్ముడైన ఆస్తీకుడు జనమేజయ సర్పయాగాన్ని నివారించగలడని తెలిసి వాసుకి, చెల్లెలి వివాహం జరత్కారువుతో జరిపించాడు.
సర్పసంహార యాగాన్ని చేయ సంకల్పించిన రాజు జనమేజయుడు. దానికి కారణం - తన తండ్రియైన పరీక్షిత్తును తక్షకుడు కాటు వేసి సంహరించడమే.
ఉదంకమహర్షి, గురుపత్ని నియోగుడై, పౌష్యకమహారాజు భార్య కుండలములను తీసుకువస్తుండగా వానిని తక్షకుడు మార్గమధ్యంలో హరిస్తాడు. తన తపోబలం చేత ఉదంకుడు నాగలోకం ప్రవేశించి, నాగులను ప్రసన్నం చేసుకుని, పాతాళలోకంలో బడబాగ్ని ప్రజ్జ్వలింపచేసి తక్షకుని చేత కుండలాలను తిరిగి పొంది, వాటిని గురుదక్షిణగా గురుపత్నికి అందజేస్తాడు.

తనకు తక్షకుడు చేసిన అపకారానికి ప్రతీకారంగా, తండ్రియైన పరీక్షిత్తు మరణానికి కారకుడైన తక్షకసంహారనిమిత్తం సర్పయాగము చెయ్యమని జనమేజయ మహారాజును ప్రేరేపిస్తాడు.

అందుకు జనమేజయుడు విప్రులను సంప్రదించగా పురాణజ్ఞుడైన ఒక బ్రాహ్మణుడు, రాజా నీవు చేయబోయే ఈ యజ్ఞం ఋత్విక్కులు శాస్త్రోక్తంగా  చేసే క్రియాకలాపం చేత సమగ్రమైనప్పటికి చివరి దాకా సాగదని, ఒక బ్రాహ్మణోత్తముని కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది అని భావిని గురించి తెలిపాడు.
అయినప్పటికీ అతని మాట పెడిచెవిన బెట్టి జనమేజయుడు సర్పయాగం చేయడం మొదలెట్టాడు.

బ్రాహ్మణుల మంత్రాల, అగ్నిలో వ్రేల్చే పదార్థాల ప్రభావం చేత వశం తప్పినవారై గొప్ప సర్పములు పెక్కు తలలు గలవి, కోరల్లో విషరూపమైన అగ్నిగలవి, అధికమైన వేగంతో అగ్నిలో పడి భస్మమవజొచ్చాయి.

"తడబడబడియెడు రవమును, బడి కాలెడు రవము, గాలి పలుదెరగుల ప్రస్సెడురవమును, దిగ్వలయము గడుకొని మ్రోయించే నురగకాయోత్థితమై".  

తొట్రుపాటు పడుతూ, అగ్నిలో పడేటప్పుడు కలిగే ధ్వనియున్ను పడి కాలే ధ్వనియున్నూ, కాలి పెక్కువిధాల బ్రద్దలయ్యేప్పుడు కలిగే ధ్వనియున్ను, పాముల దేహాల నుండి బయల్వెడినవై దిక్చక్రాన్ని అతిశయంగా మ్రోగేటట్లు చేశాయి. 

ఆ సమయంలో వాసుకి, చెల్లెలి వద్దకు వెళ్లి మేనల్లుడైన ఆస్తీకున్ని జనమేజయమహారాజు వద్దకు వెళ్లి సర్పయాగం మాన్పించి పాములను రక్షించేలా చేయమని కోరగా తల్లి కుమారుని పిలిచి నీ మేనమామ వాసుకి చెప్పిన పని నిర్వర్తించుమని ఆజ్ఞాపించింది. 

ఆస్తీకుడు వేదవేదాంగాలలో నిష్ణాతులైన బ్రాహ్మణశ్రేష్ఠులతో జనమేజయుడు సర్పయాగం చేసే యాగశాలకు వచ్చి "స్వదేహకాంతి సభాంతరంబెల్ల బర్వ" తన మేనికాంతిచే సభామధ్యమంతా ప్రకాశిస్తుండగా (మహాతేజస్సంపన్నుడైన మహర్షి) మంగళవాక్య పూర్వకంబుగా జనమేజయుడిని ఈ విధంగా కీర్తించాడు. 

చంద్రవంశానికి అలంకారపురుషుడవై, రాజర్షివై ధర్మంతో కూడిన ప్రవర్తనతో భూమిని పాలిస్తూ ప్రసిద్ధులైన సూర్యచంద్రవంశ పూర్వరాజుల నడవడిలో ఉత్తముడవు నీవు. 
ఇంతవరకు దేవతలు, భూపతులు చేయని ఆది యజ్ఞమైన ఈ సర్పయజ్ఞం ధర్మరాజు రాజసూయం, బ్రహ్మ చేసిన ప్రయాగ యజ్ఞం, వరుణ, కృష్ణుల యజ్ఞాల కంటే ఎంతో గొప్పది సుమా!

ఈ యజ్ఞ ఋత్విక్కులు బుద్ధిసంపన్నులు, తపస్సే ధనంగా కలవారు, బ్రహ్మతో సమానులు, ఇంద్రుడి యగ్నంలోని ఉత్తమ ఋత్విజుల కంటె ప్రసిద్ధులు. 
విద్వాంసులలో శ్రేష్ఠుడు, మూర్తీభవించిన ధర్మమూర్తి, ముల్లోకాలలో ప్రసిద్ధ తేజస్వి, సుజనుడైన వ్యాసమహర్షి స్వయంగా కుమారుడితోను, శిష్యులతోను, ఋత్విజుల సముదాయంతోను యజ్ఞంలో పాల్గొన్నాడంటే, రాజులలో నీవు సాక్షాత్తుగా విష్ణుమూర్తివే.

అగ్నిహోత్రుడే స్వయంగా సాక్షాత్కరించి తన చేతులతో బ్రాహ్మణోత్తముల దివ్యమంత్రాల చేత హోమం చేయబడిన అన్నాదిహవ్యాలను గ్రహించి పుణ్యఫలితాలను నీకు ప్రసాదిస్తున్నాడు. ధన్యుడవు రాజా!" అని ఈ విధంగా ఆస్తీకుడు జనమేజయ మహారాజును, అతని యజ్ఞ మహత్యాన్ని, యజ్ఞం చేయించే ఋత్విక్కులను, యజ్ఞానికి వచ్చిన సదస్యులను, పూజ్యుడైన అగ్నిని మంగళవాక్కులతో మాటలో కరకుతనం లేకుండా, గట్టిదనం స్ఫురించకుండా, మృదువుగా, వినయంగా, హితంగా ప్రార్థిస్తున్నట్లు నివేదించుకొన్నాడు. 

అంతట మహారాజు ఆస్తీకుని చూచి, "మునిశ్రేష్ఠా! నీకేది ప్రియమో దానిని నేనిస్తాను. అడుగుమనగా ఆస్తీకుడు, అభిమన్యు వంశోద్ధారకా! జనమేజయ మహారాజా! నాకు ప్రీతి కలిగేటట్లుగా ఈ సర్పయాగాన్ని మాని, పాముల సమూహాన్ని కాపాడుమని కోరాడు. 
అప్పుడు యాగం వీక్షిస్తున్న సభ్యులందరూ ఏకకంఠంతో అర్హుడు, తపోధనుడైన ఉత్తమబ్రాహ్మణోత్తమునకు ప్రీతితో కోరినది ఇవ్వటం సముచితమని పలుకగా, అందరికి సమ్మతమయ్యేటట్లుగా జనమేజయుడు అతని కోరిక మన్నించి సర్పయాగం మానాడు!
ఈ కథలోని చిక్కు ప్రశ్న తన పేరున్న అమ్మాయినే జరత్కారుడు వివాహమాడడంలోని ఆంతర్యం పండితులే వివరించాలి. (సనామధేయయగు కన్యతో వివాహము). 


                                                            ******

No comments:

Post a Comment