Saturday, February 19, 2011

ఉపోద్ఘాతము (Upodghathamu)

మా తండ్రిగారైన కీ. శే. డా|| శ్రీ సి.యం. కృష్ణమూర్తి గారు కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధి గాంచిన వైద్య నిపుణులు. తేది 24-02-1940 న కృష్ణం చెట్టిపల్లె, గిద్దలూరు తాలుకా, ప్రకాశం జిల్లా లో తల్లితండ్రులైన చిత్తారి మాచరౌతు ఎల్లమ్మ, చిత్తారి మాచరౌతు వెంకటసుబ్బయ్య వర్మ గార్లకు జన్మించి, కర్నూలు పురపాలకోన్నత పాఠశాల,  కర్నూలు ఉస్మానియా కళాశాల, తదనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యను  కొనసాగించి, జనరల్ మెడిసిన్ లో ఏం.డీ., డిగ్రీ తీసుకొన్నారు. విశాఖపట్టణం ప్రభుత్వ వైద్య కళాశాలలోను, గుంటూరు మరియు కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలోను వైద్య ఆచార్య (మెడిసిన్ ప్రొఫెసర్) పదవి నిర్వహించారు. 
తెలుగు భాష పై, తెలుగు సాహిత్యం పై నున్న అభిమానం కొలదీ డా|| కృష్ణమూర్తి గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి తెలుగు లిటరేచర్ లో బ.ఏ., ఏం.ఏ., డిగ్రీలు కైవసం చేసుకున్నారు. కవిత్రయ మహాభారతముపై చిన్ననాటినుండే మక్కువ ఏర్పడి నిత్యపారాయణముగా చదివి, దాదాపు రెండు వేల పద్యములు కంటస్థం చేసారు. నన్నయ మహాభారతముపై ఆంధ్రదేశమున అనేక ప్రసంగాలు, సప్తాహాలు చేసారు. 2005, 2006 సం|| లలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికలలో మహాభారతంపై  వ్యాసాలు ప్రచురించారు.  అమెరికా, ఇంగ్లండు దేశములలో కూడా నన్నయ మహాభారతముపై ఉపన్యాసములు వహించారు. 2007 న "కవిత్రయ మహాభారతంలో ధర్మసూక్ష్మాలు" అను పుస్తకమును రచించారు.  

రెండవ పుస్తకమును ప్రచురించు యత్నములో ఉండగా, దైవ నిర్ణయమున 2010 జూన్ 17 న దివంగతులయ్యారు. కవిత్రయ మహాభారతములోని ధర్మసుక్ష్మాలను వివిధ జనులకు అందించాలనే మా తండ్రి గారి ఆశయం నెరవేర్చడం కొరకు మరియు వారి స్మృతిగా తలపెట్టిన ఈ "పద్యాల వైద్యుడు" శీర్షికను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము. 



2 comments: