Sunday, December 9, 2012

కారణజన్మురాలు ద్రౌపది (Kaaranajanmuralu Draupadi)

అయోనిజ, కారణజన్మురాలు, పాండవుల పత్ని. "అతి రూపవతి భార్యాశతు్రః" అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. సాటి స్త్రీలే అసూయపడేటంత లావణ్యవతి ద్రౌపది.

రాజసూయ మహాధ్వర సమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని ఈర్ష్యకు కారణభూతమైనది.

ద్రౌపది అయోనిజ. కారణజన్మురాలు. కోకిలాదేవి- పాంచాల ప్రభువు ద్రుపదులకు అగ్నిగుండంలో జన్మించిన పుత్రిక. సహోదరుడే దృష్టద్యుమ్నుడు.

త||     "కులపవిత్ర సితేతరోత్పల కోమలామలవర్ణయు
           త్పలసుగంధి, లసన్మహోత్పలపత్రనేత్ర యరాళకుం
           తల విభాసిని, దివ్యతేజము దాల్చి ఒక్క కుమారి 
           తజ్జ్వలన కుండము నందు బుట్టెప్రసన్నమూర్తి ముదంబుతోన్"

వంశాన్ని పావనం చేసేది, నల్లకలువ వంటి శరీర వర్ణం కలది, కలువగంధం వంటి సుగంధం గలది, కళకళలాడే పెద్ద కలువరేకుల వంటి కన్నులు గలది, వంకరలు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది, దివ్యతేజస్సును ధరించేది, మనోహరమైన ఆకారం గలది అయిన ఒక కన్య, సంతోషంతో ఆ అగ్నికుండంలో ఉదయించింది.

పాండవధర్మపత్నిగా జీవితం సాగించింది. "అతిరూపవతీ భార్యా, తు్రః"  అన్న నానుడి చొప్పున జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.

రాజసూయ మహాధ్వరసమయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. రాజసూయంలో జరిగిన అన్నదానం, ఆ అన్నదాన కార్యనిర్వాహకురాలుగా ఆ ద్రౌపదీదేవి వెలిగిన వెలుగు, దుర్యోధనుని కన్ను కుట్టించింది. మిత్రుడు అభిమానంతో చేసే ప్రశంస కంటే శత్రువు అసూయతోనైనా చేసే ప్రశంస సత్యము, ప్రశస్తమైనది.

"ద్రౌపదీదేవి అన్ని దేశాల నుండి రాజసూయ యాగం చూడటానికి వచ్చిన రాజశ్రేష్ఠులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, దగ్గరి బంధువులను, స్నేహితులను, వీరభటులను, పనివాళ్లను, పేదలను, బైరాగులను, అందరినీ ప్రతిదినం స్వయంగా విచారించి,  తగిన రీతిగా దయతో అన్నం పెట్టి, అందరు భుజించిన తర్వాత అర్ధరాత్రి కాని తను తృప్తిగా భుజించేది కాదు. అంతేకాదు, ఆ మహాయాగంలో అధముడు కూడా ప్రేమతో పూజలందుకొన్నాడు గాని, కోరుకొన్నది లభించనివాడు ఒక్కడైనా లేడు".

రాజసూయంలో అభిషిక్తుడైన ఆ ధర్మరాజుకు, సాత్యకి ముచ్చటగా ముత్యాలగొడుగు పట్టాడు. శ్రీకృష్ణపాండవులు పట్టాభిషిక్తులయిన రాజులందరిని వేరువేరుగా కొనిపోయి ధర్మరాజుకు మ్రొక్కించారు. ఆ వైభవాన్ని చూచి నేను, తక్కిన రాజులు వెలవెలబోతూ ఉంటే శ్రీకృష్ణపాండవులు, ద్రౌపది, సాత్యకి అదే పనిగా ఆనందాతిశయంతో మమ్మల్ని చూచి నవ్వారు" అంటాడు.

ఈ నవ్వే దుర్యోధనుని హృదయంలో గాడంగా గ్రుచ్చుకొన్నది. మాయాద్యూతానికి ఆహ్వానింపబడి ధృతరాష్ట్ర మందిరానికి భర్తలతో ఏతెంచిన పాండవధర్మపత్నిని-
"అఖిలలావణ్య పుంజంబు నబ్జభవుడు మెలతగా దీని యందు నిర్మించె నొక్కొ కానినా డిట్టి కాంతి యే కాంత లందు నేల లేదని సామర్ష హృదయలయిరి"
బ్రహ్మదేవుడు సమస్త సౌందర్యకాంతి సమూహాన్ని ఈ ద్రౌపదీకాంతగా నిర్మించినట్లున్నాడు. అందువల్లనే కాబోలు, ఇంతటికాంతి ఏ  యితర కాంతల్లోను కానరాదు- అని అక్కడి వాళ్లంతా అసూయ చెందారు. సాటి స్త్రీలే అసూయ పడేటంత లావణ్యవతి ద్రౌపది. 

విశేషించి మయసభలో దుర్యోధనుడు పొందిన భంగపాటును చూచి, పరిచారికాపరివృతయై పక్కుమన్న ద్రౌపది నవ్వు, దుర్యోధనుని వేధించి వెంటాడి, అతనిలో ప్రతీకారజ్వాలలు రేపింది.

దాని పర్యవసానమే మాయాద్యూతం. ఇందులో ధర్మజుడు తనను, తమ్ములను, తుదకు కట్టుకున్న భార్యను కూడా పణంగా ఒడ్డి ఓడిపోయాడు. ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని సూచించినవాడు, ద్రౌపదీ నగ్నసౌందర్యాన్ని చూడ ఉసిగొల్పినవాడు కర్ణుడే. దీని పర్యవసానం భీముని భీష్మప్రతిజ్ఞలు. ఒకటి దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం త్రాగటం, రెండు ఊరుభగ్నమొనర్చి, సుయోధనుని సంహరించటం.

జగద్రక్షకుడైన నారాయణుని మహిమవల్ల ద్రౌపది శరీరం మీద చీర తొలగకుండా నిలిచి ఉండటం చేత, ఆమె తన మానం కాపాడుకున్నది.
అరణ్యవాస సమయంలో ద్రౌపది, శ్రీకృష్ణునితో -
"నేను చక్రవర్తి అయిన పాండురాజు కోడలిని, వీరాధివీరులైన పాండవుల భార్యను, మహాబలశాలియైన ద్రుష్టద్యుమ్నుడి సహోదరిని, నీకు చెల్లెలిని. అట్టి నన్ను దుశ్శాసనుడు నిండు సభలో తల వెంటు్రకలు పట్టి ఈడ్చాడు, వలువ లొలిచి దారుణంగా అవమానించాడు. అప్పుడు పాండవులు మిన్నకున్నారు. భీష్మాదివృద్ధులు, బంధువులు చూచి ఊరకున్నారు. శరణువేడిన వారిని కాపాడే పాండవులే, నన్ను రక్షించండని మొరపెట్టుకున్న నా ఆక్రందన ఆలకించలేదు గదా! ఇంకా భీమార్జునుల భుజబలమెందులకు?" అన్నది.

దీనికి సమాధానంగా శ్రీకృష్ణుడు "నీ హృదయతాపం కారణంగా ప్రేరితుడై అర్జునుడి కఠోరబాణపాతం చేత ధార్తరాషు్ట్రలు మృత్యుసదనానికి చేరక తప్పదు. సప్తసాగరాలు ఇంకినప్పటికిన్నీ, పగలూ, రాత్రీ తారుమారైనప్పటికిన్నీ, నా మాట నిజంగా జరిగి తీరుతుంది" అని ఓదార్చాడు.

అరణ్యవాస సమయంలో ఏకాంతంగా ఉన్న నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లత వలె ఆ అడవినంతటిని తన శరీరప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మోహించి, బలాత్కరించబోగా, భీముడు వాని వెంటు్రకలు గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదుశిఖలుగా నిలిపి అవమానించాడు.

అజ్ఞాతవాస సమయంలో విరాటుని అంతఃపురంలో పరిచారికావేషములో ఉన్న ద్రౌపది సౌందర్యమే ఆమెకు చేటు తెచ్చి పెట్టినది.
పురజనులు, సైరంధ్రీవేషంలో ఉన్న ద్రౌపదిని చూచి ఈమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి. అంతేకాని, మానవకాంత మాత్రం కాదు, తన రూపాధిక్యం చేత చూపరులను ఆకట్టుకొందనుకున్నారు.

దీనిని బట్టి సుధేష్ణ గాని, కీచకాదులు గాని ఆమె ద్రౌపదీత్వాన్ని గుర్తించలేదు. దేవాంగనేమో అనే సందేహంలో పడ్డారు. ఆ భావనే ఆమెకు, ఆమె అజ్ఞాతవ్రతానికి శ్రీరామరక్షగా నిలిచింది.

సుధేష్ణ ద్రౌపదితో తొలి సమాగమంలోనే, భామా! నీ రూపాన్ని చూచి మా రాజు ఉవ్విళూ్లరటం ఖాయం. అటువంటి నీ చేత నేను ఎట్లా పని చేయించుకొంటాను? ఆడవాళ్లు కూడా నీమీద చూపులు నిలిపి వింతగా చూస్తారు. ఇంకా వేరే మాటలు ఎందుకు?
భర్తలను మొదట అనుమానించటం స్త్రీల స్వభావం. తమ్ముడైన కీచకుడిని మాత్రం సుధేష్ణ శంకించలేదు.

అనుకున్నదొకటి, జరిగింది వేరొకటి. ద్రౌపది సౌందర్యం సింహబలునకు కాముకతను కల్పించింది, తుదకు అతని అసువులనే హరించింది.

కీచక వధాఘట్టమున ద్రౌపది వాక్చాతురి, నిర్వాహకత్వము తిక్కనగారు చిత్రించిన తీరు కడు ప్రశంసనీయమైనది. సుధేష్ణ కోరికపై కీచకమందిరానికి మద్యం తెచ్చేందుకు వెళ్లిన ద్రౌపది బలాత్కారానికి గురి కాబోయి తప్పించుకుని, పరుగుపరుగున విరాటరాజు కొలువు దీరిన సభ ప్రవేశించింది. కీచకుడు వెంటాడుతూ రాగా, కోపాతిశయంతో సమయం సందర్భం మాటమరచి, ఆగ్రహంతో ధర్మభీములున్న ఆ సభలో తన భర్తలకు తగిలి వచ్చేటట్లుగా మాట్లాడసాగింది.

మహావీరులు గంధర్వులైదుగురు నాకు భర్తలై ఉన్నా, ఈ విధంగా ఒకడు నన్ను అవమానం చేస్తుంటే చూస్తూ మిన్నకుండటం ఆశ్చర్యం కాదా? ఇక ఎవ్వరి భార్యలు ఈ రాజ్యంలో మర్యాదగా బ్రతుకగలుగుతారు? ఈ సభలో ధర్మభీతితో ఎవరైనా ఒక మాటైనా మాట్లాడారా? ఈ విధంగా కీచకుడు పతివ్రతనైన నన్ను, ఏ ఆడవారినీ అవమానించని విధంగా అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్న మీలో, కొందరికైనా దయ రాలేదా? ఇందుకు ఈ మత్స్యదేశానికి ప్రభువుగా ఉన్న ఈ రాజుననాలి. కీచకుడు చేసిన అధర్మాన్ని చూచి దండించకుండా వదలిపెడతారా? అని రోషంగా పలికింది. ఆ మాటలకు విరాటుడు మారు పల్కలేకపోయాడు. పైగా కీచకుడిని సాంత్వవాక్యాలతో సమాధానపరచి పంపాడు. ప్రజలామె దైన్యానికి సానుభూతి ప్రకటించారు.

ధర్మరాజుకు రోషం వచ్చింది. కాని, నిగ్రహించుకొన్నాడు. నిర్వికారంగా సహజస్వరంతో ద్రౌపదితో ఓ వనితా, నీ మాటలన్నీ రాజూ, సభవారూ విన్నారు. ఇంక పలుమాటలు పలుకకుండా సుధేష్ణ సదనానికి వెళ్లుము. నీ పరాభవాన్ని చూచి నీ పతులైన గంధర్వులు కోపించకుంటారా? ఇది సమయం కాదు. నీకైనా, వారికైనా, ఇప్పుడేమైనా, వారు కోపాన్ని ప్రకటించరు. కాబట్టి నీ పతులను నిందించబోకుము. సభలో ఇంతసేపు శంక లేకుండా ప్రకటంగా నిలిచి ధిక్కరించటం సమంజసం కాదు అని ధర్మరాజు హెచ్చరించినా సైరంధ్రి అక్కడనుండి కదలలేదు.

అప్పుడు ధర్మరాజు ఇలా మందలించాడు. నీవు కులసతి గౌరవం కించపడేటట్లు ఇట్లా సభలో పలుపోకలతో విచ్చలవిడిగా నాట్యం చేస్తున్న విధంగా మెలగటం తగునా? అన్నాడు. ఆ మాటకు పాంచాలి సాభిప్రాయంగా సమాధానం చెప్పింది. కంకుభట్టా! నా భర్త నటుడు. ఆ మాట నిజం. పెద్దవారి వలెనే చిన్నవారు కూడా! కాబట్టి నా పతి వలెనే నేనూ నటిని కాబట్టి నాకు నాట్యం పరిచయమే. నా భర్త నటుడే కాదు, జూదరి కూడా. ఇక జూదరి ఆలికి మర్యాద ఎక్కడుంటుంది? అని ఆర్తితో అక్కడి నుండి సైరంధ్రి వెళ్లిపోయింది.

ద్రౌపది వంటశాలలో నిద్రిస్తున్న భీముని వద్దకు రహస్యంగా రాత్రి వెళ్లింది. కరస్పర్శతో లేపింది. తన అవమాన గాధనంతా వివరించి చెప్పింది. అన్న ధర్మజుడు వారించకపోతే కీచకుడి అంతు ఆనాడే చూచేవాడిననీ, కానీ అందువల్ల సమయభంగమయ్యేదని వివరించాడు. మహాపద తప్పిందని ఇక కార్యసాధనకు ప్రణాళిక చెప్పాడు. కీచకుణి్న ఉపాయంతో చంపాలి. వాడు రేపు నిన్ను సమీపిస్తే, ఒడబడినట్లు నటిస్తూ నర్తనశాలను సంకేతస్థలంగా పేర్కొని ఒంటరిగా అర్ధరాత్రి రమ్మని నిర్దేశించుము. సంకేతస్థలంలో నీ బదులు నేనే చిమ్మచీకట్లో పరుండి ఉంటాను. కీచకుడు సమీపించగానే విజృంభించి చంపి నీకు చూపుతానన్నాడు.

మరునాడు ద్రౌపది భీముడు చెప్పిన విధంగా చేసింది. అంతే, ఆ రాత్రి వాడు భీముని చేతిలో దుర్మరణం పొందాడు.

భీముడు గూఢమర్దనక్రియలతో కీచకుడిని చంపి కాళ్లూ, చేతులూ, కడుపులోకి చొప్పించి, ముద్ద చేసి భయంకరంగా పడవేశాడు. ఆ వికృతాకారాన్ని ద్రౌపదికి చూపి అదిగో నా మాట నిలుపుకొన్నాను. నీ అవమాన భారాన్ని మాన్చాను. నిజమా? ద్రౌపదీ, నీచింత తొలగిందా? నా భుజబలం నీకు నచ్చిందా? నీకు శాంతి చిక్కిందా? ఈ దుర్మార్గుడి గతి చూచావా? నిన్నవమానించ దలచుకొన్న ఎంత వీరుడి గతి అయినా ఇంతే. ఇది తెలిసి ఆనందించుమని భీముడు పలికాడు. భీముని ఉత్తమనాయకుడుగా కీర్తించింది ద్రౌపది.

అజ్ఞాతవాస పరిసమాప్తి అనంతరం, సంధిసంధాతగా శ్రీకృష్ణుడు హస్తినకు బయలుదేరినాడు. పతులందరూ సంధికావలెనని కోరుచున్నారు. ఈ సంకటస్థితిలో శ్రీకృష్ణుడు, ద్రౌపది అభిప్రాయమడిగినాడు. ఇక ద్రౌపది పతులను వ్యతిరేకించుటెట్లు? అట్లని అవమానము భరించుటెట్లు? అప్పుడామె ప్రదర్శించిన వాక్చాతురి, నిర్వాహకత్వమును, తిక్కన ఆంధ్రభారతమున వ్యక్తీకరించిన విధానము అద్వితీయము, అమోఘము.

"వరమున బుట్టితిన్, భరతవంశము జొచ్చితి, నందు 
పాండుభూవరునకు కోడలైతి, జనవంద్యుల బొందితి, 
నీతివిక్రమస్థిరులగు బుత్రులం వడసితిన్, సహజన్ముల 
ప్రాపు గాంచితిన్ సరిసిజనాభ యిన్నిట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్"

(పుట్టింటి గౌరవం, మెట్టినింటి గౌరవం, అత్తామామల గౌరవం, భర్తల గౌరవం తనకున్నాయని అంటుంది ద్రౌపది).

"ద్రౌపది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మున విడ్చి వెండ్రుకల్ దా వలచేత బూని, యసితచ్ఛవి బొల్చు మహాభుజంగమోనా విలసిల్లి వ్రేలగ, మనంబున బొంగు విషాదరోషముల్ గావగలేక బాష్పముల్ గ్రమ్మగ దిగ్గన లేచి యార్తయై"
ద్రౌపది తన ఒప్పిదమైన కొప్పును గ్రక్కున విప్పి శిరోజాలను కుడి చేతదాల్చి, నల్లని రంగుతో నిగనిగలాడే పెద్ద పామువలె ప్రకాశిస్తూ వ్రేలాడుతుండగా తన హృదయంలో చెలరేగు దుఃఖాన్నీ, క్రోధాన్నీ ఆపుకొనలేక, కనులలో అశ్రువులు నిండగా విలపిస్తూ తటాలున పీఠం నుండి లేచి కృష్ణా, ఈ శిరోజాలు దుశ్శాసనుడు నన్ను బలాత్కారంగా సభకీడ్చి తెచ్చే వేళ అతడి చేతివ్రేళ్లలో చిక్కుకొని సగం తెగిపోగా మిగిలినవి. నీవు కౌరవుల దగ్గర సంధి వచనము లాడే సందర్భంలో వీటిని జ్ఞప్తిలో ఉంచుకోవాలి.

ఈ నా తల వెంటు్రకలను పట్టి సభలోని కీడ్చి తెచ్చిన ఆ దుశ్శాసనుడి హస్తం, అతని దేహం యుద్ధంలో ప్రప్రథమంగా ఇంతింత ముక్కలై చెల్లాచెదురుగా నేలబడి రూపుమాసి ఉండగా చూచినప్పుడే నా మనస్తాపం చల్లారగలదు. అల్పకార్యాలతో చల్లారే అగ్ని కాదిది. ఆ విధంగా పరిభవముల పాలైన ధర్మనందనుడూ, నేను దుర్యోధనుడి శవాన్ని కనులార చూడటానికి నోచుకొనకపోతే, కొండంత గదను మూపున వేసుకొని తిరిగే భీమసేనుడి భుజబలమూ, ఆదరంతో గాండీవమనే పేరుగల దొడ్డ వింటిని ధరించే పాండవమధ్యముడి శౌర్యమూ తగులబెట్టనా ?

అచ్చతెనుగు పదములలో తిక్కనగారు ఏడ్చుచున్న ద్రౌపదిని, పెచ్చరిల్లిన అచ్చమైన ఆమె కోపాన్ని పఠితల కన్నుల ఎదుట సాక్షాత్కరింపజేసినారు. శత్రుసంహారమే ఆమె కడుపు మంటకు చల్లార్పు!

దుష్టులను శిక్షించటానికి, లోకాలను రక్షించటానికి పూనుకొని ఉన్న నీవంటి తోబుట్టువు, మిక్కుటమైన పరాక్రమంతో దీపించే భర్తలు కలిగి కూడా నేను ఇంతటి పరాభవజనిత క్రోధాగ్నిని, నిప్పును ఒడిలో నుంచుకొన్న చందాన రాక్షససహనంతో భరిస్తున్నాను. ఈ పరాభవానలం శమించటం ఇంకెప్పటికో అని రోదించింది ద్రౌపది.

దీనికి సమాధానంగా  శ్రీకృష్ణుడు ద్రౌపదితో, అమ్మా! శపథం చేసి చెబుతున్నాను, నా పలుకు లాలకించుము. విరోధులైన కౌరవులను యుద్ధంలో చంపి, ప్రకాశమానమైన, పుణ్యసమృద్ధితో కూడిన పాండురాజు తనయుల మిక్కుటమైన వైభవాన్ని నీవు దర్శించగలవు. ఇందుకు అట్టే ఆలస్యం లేదు. నా మాట నిజం. నమ్ముము.

కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అవమానము ఆమె కడుపులో రగుల్కొన్న కోపాగ్ని మహాభారతసంగ్రామమునకు ఇతోధికముగ దోహదము చేసినవి. కౌరవనాశముతో అవి చల్లబడినవి.

కర్ణపర్వంలో 18 నాటి యుద్ధంలో దుశ్శాసనుడి మరణం సంభవిస్తుంది. భీముడెలా వాడిని చంపాడో తిక్కన గారి యుద్ధవర్ణనలో పరాకాష్ఠ -
"నరసింహుండసురేంద్రు వ్రచ్చు కరణి, న్రౌద్రంబుదగ్రంబుగా నురమత్యుగ్రత జీరి, క్రమ్ము రుధిర మ్ముల్లాసియై దోయిట న్వెరవారంగొని త్రావు, మెచ్చు జవికి, న్మేనున్ మొగంబున్ భయంకరరేఖం బొరయంగ జల్లికొను, నక్కౌరవ్యు జూచుం బొరిన్" 
నరసింహస్వామి హిరణ్యకశిపుడి పొట్ట చించినట్లు భీముడు ప్రచండరౌద్రమూర్తి అయి కసిదీరేటట్లు బెట్టిదంగా దుశ్శాసనుడి రొమ్మును చీల్చి పొట్ట నుండి పొంగే నెత్తురును దోసిలి నిండా పట్టుకొని, ఆనందాతిశయంతో ఉబ్బి, మధువు త్రాగినట్లు గుటగుట త్రాగి ఒయ్యారమొలికించి పనితనం చూపాడు. త్రాగుతూ నెత్తురును మెచ్చుకొన్నాడు. ఇంకా కొంత రక్తాన్ని ముఖం మీద, ఒంటి మీద చల్లుకొని భయంకరమూర్తి అయి క్రూరవిన్యాసాన్ని ప్రదర్శిస్తూ మాటిమాటికీ ఆ దుస్శాసనుడిని చూచాడు.

భీమునికి కౌరవులపై గల కసి, ఇట్లా చేయించింది. అతడి భయంకరరూపాన్ని చూచి యోధులు అందరూ యుద్ధం మాని నిశ్చేష్టులయ్యారు.

చివరి రోజైన 18వ నాడే దుర్యోధనుడు భీముని గదాఘాతానికి బలయ్యాడు. అశ్వత్థామ కారణంగా తుదకు సుత సోదరమరణశోకమును ద్రౌపది భరించాల్సి వచ్చింది. ఆమె ఉదాత్తగంభీరవ్యక్తిత్వము ఎవరి ద్రుష్టినైనా ఆకర్షించగలవు. ఎంతో మెప్పును పొందగలవు. ధన్యజీవి ద్రౌపది, మహాసాధ్వి!


                                           *******  

1 comment:

  1. Maha Manava Samhaaram Yugaantham lo jarige hanana kratuvuvu loo Droepsthidey agra sthaanam

    ReplyDelete