Monday, February 21, 2011

వింటే భారతాన్నే వినాలి! (Vinte Bharathanne Vinali)

మన మహర్షులు విశ్వం నలుమూలల నుండి గొప్ప భావాలను ఆహ్వానించారు. సమస్త ప్రాణకోటికి సుఖశాంతులు ఆకాంక్షించారు. మాకు, వారికి అన్న సంకుచిత తత్త్వం వారి ఊహకే అందని విషయం. ( "ఆనోభద్రా క్రతవో యంతు విశ్వతః" వేదప్రమాణం  - Let noble thoughts come to us from every side.)

అలాంటి మన మహర్షులు ప్రపంచమానవాళికి  ప్రసాదించిన అమృతకలశములు రామాయణ, మహాభారత కావ్యములు. భారతీయ సాహితికి సువర్ణ శిరోభూషణములు. రామాయణము వాల్మీకి మహర్షి విశిష్ఠ సృష్టి, భారతము భారతీయ ధర్మతత్త్వ సమగ్రదృష్టి. ఈ మహాభారతాన్ని 3 సం||లు కృషి చేసి మహాభారత గ్రంధముగా వేదవ్యాసుడు రూపొందించినాడు.

విశ్వసాహితిలో మహాభారతము వలె మానవ స్వభావమును మథించి వివిధరీతుల విస్తృతముగ చిత్రించిన మహాకావ్యము ఇంకొకటి లేదు. యదిహాస్తి తదన్యత్ర అన్న ఆర్యోక్తి సర్వవిదితము.

భారతము గురించి వివిధజ్ఞాన వేత్తలు వెలిబుచ్చిన అభిప్రాయాలు:

1. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబనిరి (Great Seers)
2. ఆధ్యాత్మవిదులు వేదాంతమనిరి (Philosophers)
3. నీతివిచక్షణులు నీతి శాస్త్రంబనిరి (Jurists)
4. లాక్షణికులు సర్వ లక్ష్యసంగ్రహమనిరి (Critics)
5. కవివృషభులు మహాకావ్యమనిరి (Poet laureates)
6. ఐతిహాసికులు ఇతిహాసమనిరి (Historians)
7. పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబనిరి. (Mythologists)

ఋషివంటి నన్నయ భట్టు 1000 సంవత్సరముల క్రితం సంస్కృతవ్యాస భారతాన్ని తెలుగులో రచించారు. ఆంధ్రసారస్వత ప్రపంచానికి తొలి తెలుగు గ్రంథం నన్నయ భారతమే.

వింటే భారతమే వినాలి, మరి తింటే గారెలే తినాలి అన్న నానుడి ఏనాటి నుంచో ఆంధ్రదేశంలో ఉన్నది. నన్నయ కాలం నాటికి తెలుగుభాషకు వ్యాకరణమే లేదాయె. ఆంధ్రశబ్ద చింతామణి వ్యాకరణ గ్రంథము సంస్కృతములో విరచితం. అంటే ఆనాడు తెలుగు, వాడుకలో వికృత పదాలు మరియు అచ్ఛికశబ్దములు కలిగిన దేశభాష. 

"కై రాకుత్తుక జుట్టు వాక్షి మెఱయున్ గట్టాణి పేరెంతయున్" ఆనాటి తెలుగు మాట కవిరాజు కంఠసీమనలంకరించిన ముత్యాలసరము - అని దీని అర్థము.

మా ఇంటికి భోజనానికి రండి అంటే మీరు సంస్కృతంలో మాట్లాడుతున్నారు. పదహారు అణాల ఆంధ్రుడిగా మరి మీరు తెలుగులో ఎలా పిలవాలి? మా ఇంటికి కూటికి రండి అని గాని లేక మా ఇంటికి తిండికి రండని గాని; కాని నన్నయ గారు మహాభారత రచనలో నూటింట డెబ్బయి ఐదు తత్సమపదములు గొని తెలుగుజాతి స్మృతికి ఇంపు గొల్పు అక్షర రమ్యతను నిండుగా సాధించారు.

కృష్ణద్వైపాయన మునిశ్రేష్ఠుని చేత చెప్పబడిన మహాభారతార్థము,   స్పష్టమగునట్లు నన్నయ తెలుగులో రచించాడు. 

ధర్మరాజు వంటి రాజరాజు సంకల్పము, నరుని వంటి నన్నయభట్టు మిత్రసహకారము వల్ల ఇట్టి మహత్తర సాధనసంపత్తి సమకూడి, ఆంధ్రజాతి పుణ్యోదయమున ఆంధ్రమహాభారత శీర్షోదయమయినది.

జీవకోటిలో శ్రేష్ఠజీవి మానవుడు, లోకములోని వింతలలో వింత మానవ స్వభావము. మానవస్వభావగతులు బహువిధములు, సంకీర్ణములు. దాని మలుపులు అనేకాలు, ఆశ్చర్యకరాలు. మహాభారత పాత్రలు నిత్యము లోకములో మనకు కనిపించు వ్యక్తులు. మహాభారత ధర్మములు మానవజాతికి శాశ్వత సందేశములు. నేలమీద మానవుడు ఉన్నంతకాలం ఇది నూతనము. అతడు పరిపూర్ణకై పరిశ్రమించినంత కాలము ఇది అవశ్యపఠనీయము. ఆశక్తిజనకము. ఆలోచనామృతము.

మహాభారతపాత్రలు సజీవశిల్పాలు. వ్యాసమహర్షి వానిని అద్భుతముగ తీర్చి దిద్దినారు. కథారూపంగా మరపురాని మనోహర మూర్తులుగా మన ముందు నిలిపినాడు. 

మహాభారత కథలు:
హృద్యములు- హృదయమునకు హత్తుకునేవి, మనోహరములు. 
అపూర్వములు- పూర్వము లేనివి, నిత్య నూతనములు.
ఎఱుక సమగ్రమములు- పూర్తి  జ్ఞానము నొసంగునవి.
అఘనిబర్హణములు- పాపము పోగొట్టునవి.

ఆ మహాముని సంకల్పబలమో 
అతని ప్రోత్సహించిన రాజేంద్రుని ప్రేరణశక్తియో
ఆ కాలపు ప్రజల ఆమోదవిలసనమో
ఆంధ్రుల శాశ్వతభాగ్య విలాసమో లేక
అన్నింటి సమాహారఫలమో !

వేయి వసంతాలు గడిచినా, నిత్యనూతనత్వాన్ని నేటికీ ఆంధ్ర మహాభారతకావ్యం సంతరించుకుని, పండితపామర హృదయాలను తరగని పరువంతో రంజింపజేయగలుగుతున్నది.

                                           ******


Saturday, February 19, 2011

ఉపోద్ఘాతము (Upodghathamu)

మా తండ్రిగారైన కీ. శే. డా|| శ్రీ సి.యం. కృష్ణమూర్తి గారు కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధి గాంచిన వైద్య నిపుణులు. తేది 24-02-1940 న కృష్ణం చెట్టిపల్లె, గిద్దలూరు తాలుకా, ప్రకాశం జిల్లా లో తల్లితండ్రులైన చిత్తారి మాచరౌతు ఎల్లమ్మ, చిత్తారి మాచరౌతు వెంకటసుబ్బయ్య వర్మ గార్లకు జన్మించి, కర్నూలు పురపాలకోన్నత పాఠశాల,  కర్నూలు ఉస్మానియా కళాశాల, తదనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యను  కొనసాగించి, జనరల్ మెడిసిన్ లో ఏం.డీ., డిగ్రీ తీసుకొన్నారు. విశాఖపట్టణం ప్రభుత్వ వైద్య కళాశాలలోను, గుంటూరు మరియు కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలోను వైద్య ఆచార్య (మెడిసిన్ ప్రొఫెసర్) పదవి నిర్వహించారు. 
తెలుగు భాష పై, తెలుగు సాహిత్యం పై నున్న అభిమానం కొలదీ డా|| కృష్ణమూర్తి గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుండి తెలుగు లిటరేచర్ లో బ.ఏ., ఏం.ఏ., డిగ్రీలు కైవసం చేసుకున్నారు. కవిత్రయ మహాభారతముపై చిన్ననాటినుండే మక్కువ ఏర్పడి నిత్యపారాయణముగా చదివి, దాదాపు రెండు వేల పద్యములు కంటస్థం చేసారు. నన్నయ మహాభారతముపై ఆంధ్రదేశమున అనేక ప్రసంగాలు, సప్తాహాలు చేసారు. 2005, 2006 సం|| లలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికలలో మహాభారతంపై  వ్యాసాలు ప్రచురించారు.  అమెరికా, ఇంగ్లండు దేశములలో కూడా నన్నయ మహాభారతముపై ఉపన్యాసములు వహించారు. 2007 న "కవిత్రయ మహాభారతంలో ధర్మసూక్ష్మాలు" అను పుస్తకమును రచించారు.  

రెండవ పుస్తకమును ప్రచురించు యత్నములో ఉండగా, దైవ నిర్ణయమున 2010 జూన్ 17 న దివంగతులయ్యారు. కవిత్రయ మహాభారతములోని ధర్మసుక్ష్మాలను వివిధ జనులకు అందించాలనే మా తండ్రి గారి ఆశయం నెరవేర్చడం కొరకు మరియు వారి స్మృతిగా తలపెట్టిన ఈ "పద్యాల వైద్యుడు" శీర్షికను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.