Monday, October 8, 2012

మహాభారతం - ఫలశ్రుతి (Mahabharatham - Phalasruthi)

        "ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు, అర్థార్థులకు విపులార్ధములను 
         ధర్మార్థులకు నిత్య ధర్మసంప్రాప్తియు వినయార్థులకు మహావినయ మతియు 
         పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదర్థులకిష్ట సంపదలను 
         గావించు నెప్పుడు భావించి వినుచుండు వారికి నిమ్మహాభారతంబు"

భావం: మహాభారతం ఎల్లప్పుడు తలచి వినే జనులకు, ఆయుర్దాయాన్ని కోరేవారికి దీర్ఘాయుస్సును, ధనాన్ని కోరేవారికి అధికమైన ధన లాభాన్ని, ధర్మాన్ని కోరేవారికి సంతత ధర్మలాభాన్ని, వినయాన్ని కోరేవారికి గొప్ప వినయంతో కూడిన బుద్ధిని, పుత్ర సంతానం కోరేవారికి పుత్ర సంతానాన్ని, ఐశ్వర్యం కోరేవారికి అభీష్టసంపదలను కలుగజేస్తుంది. 

ఇందులో చెప్పిన విషయాలు సుస్పష్టం. ఆయుస్సు, ధనం, సంతతి, ఐశ్వర్యం అందరూ కోరేవే. మరి ధర్మం, వినయం ప్రాధాన్యం ఏమిటి? 

        "విద్యాదదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం
         పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతస్సుఖం" 

ధనానికి ముందువెనుక ఉత్తమలక్షణాలనుంచారు మనవాళ్లు. అవే వినయం, ధర్మం. వినయం వల్ల ధనం సంపాదించే అర్హత లభిస్తుంది. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. భగవంతుని వద్దకు వెళ్లిన భక్తుడు వినమ్రుడై చేతులు జోడించి నిశ్చలభక్తితో నమస్కరించి కోర్కెల చిట్టా విప్పకూడదు. ధర్మసమృద్ధికి కారణమయ్యే ధనాన్ని, ఆ ధనాన్ని సద్వినియోగం చేసే సద్బుద్ధిని ఇమ్మని ప్రార్ధించాలి అని శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం చెబుతోంది. సుఖశాంతులు లేనప్పుడు ఆయుస్సు, ధనం, సంతతి, ఐశ్వర్యం అన్నీ వ్యర్థాలే.


                                                                  ******

No comments:

Post a Comment